తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఇప్పటివరకు మెజారిటీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగించిన విజయ్కు ఎట్టకేలకు లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు అధికారికంగా టీవీకేకు మద్దతు ప్రకటించాయి. దీంతో అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని కూటమి సంఖ్యాబలం మేజిక్ ఫిగర్ 118కి చేరుకుంది. టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు తమిళనాడులో అధికార సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి.
ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన 5 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే విజయ్కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు సీపీఐ నుంచి 2 మంది, సీపీఎం నుంచి 2 మంది, వీసీకే నుంచి 2 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మొత్తం సంఖ్య 118కి చేరింది. దీంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ సాధించినట్లైంది.
ఈ కీలక పరిణామాల తర్వాత విజయ్ కాసేపట్లో తమిళనాడు గవర్నర్ను కలవనున్నారు. తనకు మద్దతుగా ఉన్న 118 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితాను గవర్నర్కు అందజేయనున్నట్లు సమాచారం. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అధికారిక ఆహ్వానం కోరనున్నారు.
ఇప్పటికే రెండు సార్లు గవర్నర్ను కలిసిన విజయ్కు, స్పష్టమైన సంఖ్యాబలం చూపించాలని గవర్నర్ సూచించారు. ఇప్పుడు పూర్తి మెజారిటీతో విజయ్ ముందుకు రావడంతో గవర్నర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు విజయ్ మద్దతుదారులు, టీవీకే శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. చెన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. మెరీనా బీచ్ పరిసరాల్లో కూడా విజయ్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠానికి అడుగు దూరంలో నిలవడం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇక గవర్నర్ నిర్ణయం, ప్రమాణ స్వీకార కార్యక్రమంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.


