పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ మార్పుకు తెరలేచింది. బెంగాల్లో తొలిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. కీలక రాజకీయ పరిణామాల మధ్య బీజేపీ హైకమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని ప్రకటించింది. దీంతో పశ్చిమ బెంగాల్కు తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి చరిత్ర సృష్టించనున్నారు.
రేపు ఉదయం 11 గంటలకు కోల్కతాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
అదేవిధంగా బెంగాల్లో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ఒక డిప్యూటీ సీఎం పదవి మహిళకు దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మహిళా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో బెంగాల్ బీజేపీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. కోల్కతా సహా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడిన నేతగా గుర్తింపు పొందిన సువేందు అధికారి ఇప్పుడు రాష్ట్ర పగ్గాలు చేపట్టబోతుండటం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.
సువేందు అధికారి రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న ఆయన, తర్వాత బీజేపీలో చేరి మమతా బెనర్జీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఎదిగారు. ముఖ్యంగా నందిగ్రామ్ పోరాటం తర్వాత ఆయన జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.


