తెలంగాణలో పాఠశాల కోసం 800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేత… కేసు నమోదు

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల కాలం నాటి శివాలయం కూల్చివేత తీవ్ర వివాదానికి దారితీసింది. చారిత్రక వారసత్వాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే పురాతన ఆలయాన్ని బుల్డోజర్లతో ధ్వంసం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై చరిత్రకారులు, వారసత్వ పరిరక్షణ సంస్థలు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది.

వరంగల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ మండలం అశోక్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న ఈ శివాలయం కాకతీయుల రాజు గణపతిదేవుడి కాలానికి చెందినదిగా చరిత్రకారులు గుర్తించారు. 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం వద్ద 1231 ఫిబ్రవరి తేదీతో ఉన్న అరుదైన తెలుగు శాసనం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ శాసనంలో కాకతీయ రాజు గణపతిదేవుడిని మహారాజ ,రాజాధిరాజులుగా పేర్కొన్నట్లు పురావస్తు నిపుణులు వెల్లడించారు.

1965లోనే ఈ ఆలయాన్ని హెరిటేజ్‌ విభాగం నమోదు చేశారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన “కోట కట్ట” మట్టి కోట ప్రాంతంలో ఈ ఆలయం ఉండేది. కాకతీయుల కాలం నాటి రక్షణ గోడలు, పురాతన నిర్మాణాల అవశేషాలు ఉన్న ప్రాంతంగా ఇది గుర్తింపు పొందింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం కోసం భూమిని ఖాళీ చేసే క్రమంలో ఈ ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పురావస్తు శాఖ, ఎండోమెంట్స్‌ శాఖ అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనపై తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని జాతీయ స్మారక చిహ్నాల అథారిటీకి ఫిర్యాదు చేశారు. అనంతరం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో పాటు పురావస్తు శాఖ కూడా కేసు నమోదు చేసింది. తెలంగాణ హెరిటేజ్‌ చట్టంలోని సెక్షన్‌ 30 కింద సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై కూడా ఆరోపణలు వచ్చాయి. చారిత్రక కట్టడాలను రక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని వారసత్వ పరిరక్షణ వర్గాలు మండిపడుతున్నాయి.

మరోవైపు పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వివరణ ఇచ్చింది. మే 6న నిర్వహించిన సంయుక్త తనిఖీలో 30 ఎకరాల స్థలంలో దట్టమైన పొదలు తొలగించే సమయంలో పాడైపోయిన పాత నిర్మాణ అవశేషాలు మాత్రమే కనిపించాయని అధికారులు పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆలయాన్ని కూల్చలేదని, అది అధికారికంగా రక్షిత స్మారక చిహ్నాల జాబితాలో లేదని వివరణ ఇచ్చారు.

అయితే ప్రజా ఆగ్రహం పెరుగుతుండటంతో వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించారు. అదే ప్రదేశంలో ఆలయాన్ని తిరిగి పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చరిత్రకారులు, స్థపతులు, పురావస్తు శాఖ నిపుణుల సూచనలతో ఆలయ పునర్నిర్మాణం చేపడతామని తెలిపారు.

అదేవిధంగా భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అధికారికంగా రక్షిత వారసత్వ కట్టడంగా గుర్తించే ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనతో తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. అభివృద్ధి పేరుతో చరిత్రను చెరిపేస్తున్నారా? లేక నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Latest Articles

మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..

హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్