ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇప్పటికే హమాస్పై దాడులతో అట్టుడుకు తున్న పశ్చిమాసియాలో మరింత అగ్గిరాజేసింది. తాజా దాడుల్లో ఇజ్రాయెల్కు పెద్దగా నష్టమేమీ సంభ వించలేదు. ఇరాన్ ప్రయోగించిన వాటిలో 99శాతం డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ల సాయంతో ఆ దేశం సమర్థంగా నేలకూల్చింది. తాజా పరిణామంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఎదురుదాడులకు దిగితే ప్రాంతీయంగా పరిస్థితులు చేయిదాటేపోయే ముప్పుంది.
సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ భావిస్తోంది. ఆ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఏడుగురు సైనికాధికారులు మృతి చెందారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని కొన్ని రోజులుగా చెబుతున్న ఇరాన్.. ఏకంగా 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ మొదట డ్రోన్లు ప్రయోగించగానే ఇజ్రాయెల్కు అండగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ రంగంలోకి దిగాయి. అమెరికా 70 డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసింది. ఇరాన్ ప్రయోగించిన 120 బాలిస్టిక్ మిసైళ్లలో ఏడు మాత్రం లక్ష్యాలను తాకాయి. అండగా నిలిచినందుకు అమెరికా, ఇతర భాగస్వామ్య దేశాలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గలాంట్ కృతజ్ఞతలు తెలిపారు. దాడి సమయంలో తమ గగనతలాన్ని మూసివేసిన ఇజ్రా యెల్ తర్వాత.. తెరిచింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. మారుతున్న పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. పశ్చిమాసి యాలో నివసిస్తున్న భారతీయులతో స్థానిక రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాయంది. ఇరాన్, ఇజ్రాయెల్లోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది.ఇరాన్ దాడులు చేస్తున్న సమయంలో పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. భీకర దాడులను ఎదుర్కొని శత్రు వును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుత సామర్థ్యాన్ని చూపించిందని బైడెన్ అన్నారు. తాము ఇజ్రా యెల్కు ఉక్కు కవచంలా ఉండటానికి కట్టుబడి ఉన్నామంది. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశామని తెలిపారు.