చెన్నై వేదికగా నేడు రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ పోరులో కోల్కత్తాను హైదరాబాద్ ఢీకొట్టబోతోంది. ఈనేపథ్యంలోనే దేశంలోని బెట్టింగ్ రాయుళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం కావాల్సిన వారికి పంపించాయి. నగరంలోని ఖరీదైన హోటల్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్స్, ఫామ్హౌసుల్లోని గదులను అద్దెకు తీసుకుని బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాట్సాప్ ద్వారా 1000 రూపాయల నుంచి 10 లక్షల వరకూ పందేలు ఆహ్వానిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బుకీలు ఇళ్ల బయట సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం స్థానికులు గుర్తించి ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు, బుకీల స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
ఐపీఎల్ సీజన్లో నగరంలో 500 కోట్ల మేర పందెం సొమ్ములు చేతులు మారుతున్నా కేవలం 5-10 శాతం మాత్రమే పోలీసులకు చిక్కుతున్నాయి. ఆన్లైన్ ద్వారా పందేలు జరుగుతుండటంతో నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయి. స్మార్ట్ ఫోన్, లోన్ యాప్లతో అప్పులు, రెట్టింపు లాభాలంటూ యువకులకు వల వేస్తున్నారు. నగరంలో ఎందరో యువకులు, ఉద్యోగులు పందేలకు బానిసలుగా మారారు. కొందరు అప్పులు తీర్చలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు.