టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ ఆయన తాజా రాజకీయాలపై చర్చించారు. బాలయ్యతోపాటు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన వారిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టు సభ్యులు కూడా ఉన్నారు. కాగా, బాలకృష్ణ, రేవంత్ మధ్య సమావేశంలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన బాలకృష్ణ. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బాలయ్య వెంట బసవతారకం హాస్పిటల్ ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలకృష్ణ కలవడం ఇది రెండోసారి. తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ ప్రమాణం స్వీకారం చేశాక.. డిసెంబర్ లో పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు రేవంత్ ని కలిసిన వారిలో బాలయ్య కూడా ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆయన సీఎంని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీ కారం చేయడం, హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి బాలకృష్ణ గెలవడం ఖాయమనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ ని బాలయ్య కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమావేశం వెనుక రాజకీయ ఉద్దేశం లేదని, బసవతారకం హాస్పిటల్ కి సంబంధించిన సేవా కార్యక్రమాల గురించే ఈ భేటీ జరిగిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.