స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణకు చేరుకుంది. ఇంకా ఐదు నెలల్లో ఎన్నికలు ఉన్న క్రమంలో ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలు పెట్టింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా సీఈసీ అధికారులు పర్యటించనున్నారు. అక్టోబర్ 5-15 మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఈసీ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. తెలంగాణకు రానున్న సీఈసీ బృందం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించి పలు కీలక సూచనలు చేయనున్నారు. ఈవీఎంల పరిశీలన, ఓటర్ల తుది జాబితా తయారీ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి కూడా ఈరోజు హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు సీఈసీ బృందం హైదరాబాద్ లోనే మకాం వేసి కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీ శాఖ అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఎన్నికల ప్రవర్తనా నియమావళి, డబ్బు పంపిణీని అరికట్టడం, ఎన్నికల సమయంలో కొట్లాటలు, దాడులు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై పోలీసు అధికారులతో చర్చించనున్నారు. ఎన్నికల సమయం ఆసనం అవడంతో పార్టీలు సైతం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించడం మొదలు పెట్టాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ, కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.