ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్డీయే కూటమికి దేశవ్యాప్తంగా 400 సీట్లు అంటూ ఇదివరకే టార్గెట్ ఫిక్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీకి మౌలికంగా ఉత్తరాదిలో బలం ఉంది. కొన్ని నెలల కిందట జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కమలం పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, చత్తీస్గఢ్లో బీజేపీ విజయదుందుభి మోగించింది.దీంతో పాటు తాము అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోనూ మరోసారి విజయం సాధించారు కమలనాథులు. దీంతో ఉత్తరాదిలో తమ ప్రాబల్యానికి తిరుగులేదన్న నిర్ణయానికి వచ్చింది కమలం పార్టీ.
అయితే 400 సీట్ల టార్గెట్ సాధించడానికి మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాలపై ఆధారపడడం సరికాదని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. దక్షిణాదిన కూడా వీలయినన్ని ఎక్కువసీట్లు గెలవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో సౌత్ పుష్ పేరుతో పక్కా ప్రణాళిక తయారు చేసుకుంది కమలం పార్టీ. దక్షిణాదిన ఏ రాష్ట్రంలో ఏ ఫార్ములా ఉపయోగించాలన్నది కూడా సౌత్ పుష్ ప్రణాళికలో వివరంగా ఉందంటారు రాజకీయ విశ్లేషకులు.
వాస్తవానికి దక్షిణాది మొదట్నుంచీ భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగానే ఉంది. దక్షిణాదిన మొత్తం ఐదు రాష్ట్రాలున్నాయి. పుదుచ్చేరి పేరుతో ఒక కేంద్ర పాలిత ప్రాంతం కూడా ఉంది. 2006లోనే మిత్రపక్షాలతో కలిసి కర్ణాటక లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కర్ణాటకలో కమలం పార్టీకి బలమైన క్యాడర్ తయారైంది. కర్ణాటకను గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియాగా పేర్కొంటారు కమలనాథులు. దక్షిణాదిన ఒక్క కర్ణాటకలోనే నిన్న మొన్నటివరకు బీజేపీ సర్కార్ ఉండేది. అయితే కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వశమైంది. ఇవాళ్టి పరిస్థితి చూస్తే మొత్తంగా దక్షిణాదిన ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ సర్కార్ లేదు. పైపెచ్చు జాతీయ స్థాయిలో ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని కూడా కలుపుకుంటే దక్షిణాదిన మొత్తం 131 లోక్సభ నియోజక వర్గాలు న్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనీసం 50 నియోజకవర్గాలను గెలుచుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది కమలం పార్టీ. దీనికి బీజేపీ ఒక పక్కా ప్రణాళిక తయారు చేసుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడులోనూ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ, ఆ రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలపడింది. క్షేత్రస్థాయిలో కమలం పార్టీకి బలమైన పునాదులున్నాయి. ఒక్క కర్ణాటక మినహా మిగతా నాలుగు రాష్ట్రా ల్లో అనుకున్న స్థాయిలో బీజేపీ ఎదగలేదు. దీనికి ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులే కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు…ఈ మూడు రాష్ట్రాల్లోనూ బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయ పార్టీల వైఫల్యాలే దక్షిణాదిన బలమైన ప్రాంతీయ పార్టీలు పుట్టుకకు కారణమయ్యాయి. ఇక దేవభూమిగా పిలిచే కేరళలో మొదట్నుంచీ వామపక్షాలదే ఆధిపత్యం. దీంతో వామపక్ష భావజాలం ఉన్న కేరళలో కమలం పార్టీ ఎంట్రీ కూడా ఇవ్వలేకపోయింది.
దక్షిణాదిన కమలం పార్టీ బలపడకపోవటానికి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం ప్రధాన కారణంగా చెప్పు కోవచ్చు. అలాగే అనేక సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీపై మొదటి నుంచి ఉత్తరాది పార్టీగా ముద్ర పడింది. దీనికి కారణం సహజంగా బీజేపీ ప్రస్తావించే అంశాలే అంటారు సామాజిక విశ్లేషకులు. హిందీ భాషకు పెద్ద పీట వేయడం, సంస్కృత భాషను దేవభాష అంటూ కీర్తించడం, ద్రవిడ భాషలను చిన్నచూపు చూస్తా రన్న ఆరోపణలు …ఇవన్నీ దక్షిణాదిన కమలం పార్టీ వెనుకబడటానికి కారణమయ్యాయంటారు సోషల్ సైంటిస్టులు. సహజంగా బీజేపీ ప్రస్తావించే అంశాలు ద్రవిడులకు నచ్చవు. అంతేకాదు. ఇవేవీ దక్షిణాది సంస్కృతితో కనెక్ట్ అయ్యే అంశాలు కూడా కావు.దీంతో దక్షిణాదిలో కమలం పార్టీ చొచ్చుకుపోలేకపోయింటారు సామాజిక విశ్లేషకులు.
మౌలికంగా దక్షిణాదిన భాషాభిమానం బాగా ఎక్కువ. ఈ విషయంలో తమిళనాడును పరాకాష్టగా చెప్పుకోవచ్చు. దక్షిణాదిన ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కో భాష మాట్లాడతారు. అంతేకాదు సంస్కృతిపరంగానూ ఐదు రాష్ట్రాల్లోనూ తేడాలుంటాయి. బేసికల్ గా హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలను దక్షిణాది ప్రజలు వ్యతిరేకిస్తారు. కొన్ని దశాబ్దాల కిందట హిందీ భాషను బలవంతంగా దక్షిణాదిపై రుద్దడానికి జరిగిన ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టారు. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా జరిపారు. తమిళనాడులో జరిగిన నిరసన ప్రదర్శనలు దీనికి పరాకాష్ట . మొత్తం మ్మీద హిందీ బెల్ట్ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉత్తరాది పార్టీగానే కమలాన్ని ఇప్పటికీ దక్షిణాది ప్రజలు చూస్తుంటారు.
దక్షిణాదిన ఆశించినస్థాయిలో కమలం పార్టీ వికసించకపోవడానికి మరో ప్రధాన కారణం ఆ పార్టీకి మాస్ లీటర్ అంటూ ఎవరూ లేకపోవడం. యడ్యూరప్ప ఒక్కరే దీనికి మినహాయింపు. అయితే యడ్యూరప్ప పలుకుబడి కూడా కర్ణాటక రాష్ట్రానికే పరిమితం. మొత్తంగా యావత్ దక్షిణాదిని ప్రభావితం చేయగల మాస్ లీడర్ అంటూ బీజేపీలో ఎవరూ లేరు. ఇదిలాఉంటే, దక్షిణ భారతదేశంపై భారతీయ జనతా పార్టీ వివక్ష చూపుతుందన్న విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. నిధులన్నింటినీ ఉత్తరాది రాష్ట్రాలకే నరేంద్ర మోడీ సర్కార్ ఇస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. రైల్వే బడ్జెట్లో కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ప్రతి ఏడాదీ వినిపిస్తుంటాయి. అంతేకాదు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలోనూ దక్షిణాదికి అన్యాయం జరిగిందన్న విమర్శలు సామాజిక శాస్త్రవేత్తల నుంచి వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో దక్షిణాదిన వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కమలం పార్టీ అగ్ర నాయకులు నిర్ణయించుకున్నారు. దక్షిణాదిన వీలైనన్ని ఎక్కువ సీట్లు లభిస్తే కాంగ్రెస్ విముక్తభారత్ లక్ష్యం నెరవేరడం ఏమంత కష్టం కాదని బీజేపీ హస్తిన పెద్దలు భావిస్తున్నారు.