ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది. లాటరీలో దక్కించుకున్న మద్యం షాపుల్లో అమ్మకాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో మందుబాబులు షాపుల ముందు క్యూకట్టారు. ఐదేళ్ల తర్వాత తిరిగి అన్ని ప్రీమియమ్ బ్రాండ్లు దొరకడంతో మద్యంప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించారు. అయితే 99 రూపాయల క్వార్టర్ ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఆ స్టాక్ ఇంకా రాలేదని… రెండు, మూడు రోజుల్లో వస్తుందని షాపు యజమానులు చెప్పడంతో మందుబాబులు నిరాశగా వెనుదిరిగారు. కొన్ని చోట్ల పాత ధరలకే మద్యం అమ్ముతున్నారంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు.


