స్వతంత్ర, వెబ్ డెస్క్: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలంగా బీజేపీలో చేరికలు ఆగిపోయాయి. మరోవైపు పార్టీలోని సీనియర్ నేతల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో ఆ పార్టీ క్యాడర్ నిరాశకు గురవుతోంది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రంగారెడ్డితో అరుణ జరిపిన చర్చలు ఫలించాయని, త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డితో పాటు మరికొందరు నేతలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా రంగారెడ్డికి పేరుంది. కొద్ది నెలల క్రితం కిరణ్ కుమార్ కూడా కమలం పార్టీలో చేరగా.. ఇప్పుడు ఆయన సన్నిహితుడు రంగారెడ్డి కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.