సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. సీబీఎస్ఈ మార్కుల గందరగోళంపై సమాధానం చెప్పాలన్నారు. విద్యార్థులకు సాకులు కాదు, న్యాయం కావాలన్నారు కేటీఆర్. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సీబీఎస్ఈ మార్కుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచిన గ్లోబరెనా సంస్థనే 2019లో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదానికి కూడా కారణమైన సంస్థగా ఆయన గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని… వారి నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. సంబంధిత అధికారులను విధుల నుంచి తొలగించడంతో పాటు గ్లోబరెనా సంస్థపై న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభించామని వెల్లడించారు.
అలాంటి వివాదాస్పద చరిత్ర ఉన్న సంస్థకు మళ్లీ సీబీఎస్ఈ కీలక బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యకరమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో జరిగిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సీబీఎస్ఈ.. ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా అదే సంస్థకు అవకాశం కల్పించడంపై కేటీఆర్ ప్రశ్నించారు. గ్లోబెరెనా సంస్థ కోసం సీబీఎస్ఈ బోర్డు నిబంధనలు, విధానాలను కూడా మార్చినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు పారదర్శకత, న్యాయం, జవాబుదారీతనం అందించాల్సిన బాధ్యత సీబీఎస్ఈ, కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. విద్యార్థుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, మూల్యాంకనంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


