కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పార్కు పరిధిలో పర్యావరణ సున్నిత ప్రాంతంలో 25 నుంచి 30 మీటర్ల పరిధి ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకడంపై స్టే విధించింది సుప్రీంకోర్టు .
కాసు బ్రహ్మానంద రెడ్డి (Kasu Brahmananda Reddy National Park ) పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు(Supreme Court of India) కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ సమీపంలో ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ వరకు చెట్లను నరకవద్దని స్పష్టమైన స్టే ఆదేశాలు ఇచ్చింది.
పర్యావరణ సున్నిత ప్రాంతంగా గుర్తించిన కేబీఆర్ పార్క్ పరిధిలో 25 నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న చెట్లను తొలగించకూడదని కోర్టు పేర్కొంది. ఈ ఫ్లైఓవర్ పనుల కోసం సుమారు 1300 చెట్లు నరికివేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి( Vivek Reddy) కోర్టుకు తెలిపారు.
చెట్లను తొలగించకుండా నిర్మాణ పనులు చేపట్టే ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదైనా ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే అలాంటి ప్రణాళిక ఏదీ లేదని న్యాయవాది వివేక్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వమే రాత్రింబవళ్లు చెట్లను తొలగిస్తోందని ఆయన ఆరోపించారు.
పర్యావరణ పరిరక్షణ బోర్డు కూడా ఈ ప్రాంతంలో చెట్ల తొలగింపును వ్యతిరేకించిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు స్టే ఆదేశాలతో స్ట్రాటజిక్ రోడ్ డెవలెప్ మెంట్ ప్రోగ్రామ్( Strategic Road Development Programme) కింద జరుగుతున్న పనులు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కేబీఆర్ జంక్షన్ పరిసరాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్ల నిర్మాణంపై భారీ ప్రభావం పడనుంది.


