కోలీవుడ్ స్టార్ శింబు.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. మన్మథ సినిమా తమిళ్లోనే కాదు.. తెలుగులో కూడా శింబుకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆతర్వాత తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తాడు.. టాలీవుడ్ పై ఫోకస్ పెడతాడు అనుకుంటే.. సైలెంట్ అయిపోయాడు కానీ.. ఇటు వైపు చూడలేదు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించేందుకు శింబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. శింబు ప్లాన్ ఏంటి..? తెలుగులో శింబు చేసే సినిమా ఏంటి..?
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన శింబు 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత లవ్ స్టోరీలు, యాక్షన్ చిత్రాలు, మాస్ ఎంటర్టైనర్లతో తమిళ ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. మన్మథ సినిమాతో తెలుగులో కూడా ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే.. వరుస పరాజయాలు, వ్యక్తిగత వివాదాలు కారణంగా కెరీర్ కొంత వెనుకబడింది. తర్వాత మళ్లీ వరుస విజయాలతో శింబు తన స్థానాన్ని తిరిగి సంపాదించుకున్నారు.
ఇదిలా ఉంటే.. సూర్య, కార్తి, విశాల్, ధనుష్.. ఇలా తమిళ హీరోలు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టి ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. శింబు ఇంత వరుకు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలిసింది. కొత్త ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల విడుదలైన డ్యూడ్ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన చెప్పిన కథలో కొత్తదనం నచ్చడంతో శింబు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టును మొదట ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే సితార ఎంటర్టైన్మెంట్సే ఆ సినిమాను నిర్మించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ కోలీవుడ్ హీరో శింబు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ పై ఫోకస్ పెట్టి ఎంత వరుకు మెప్పిస్తాడో చూడాలి


