హైతీ రాజధాని పోర్ట్ అ ప్రిన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలమంది ఖైదీలు తప్పించుకొన్నారు. కెన్యాతో ఓ రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియల్ హెన్రీ ఇటీవల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను వీరు లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. ఇదే సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్ అ ప్రిన్స్ జైలుపై దాడులు మొదలయ్యాయి. ఈ జైల్లో దేశాధ్యక్షుడి హంతకులతోపాటు18మంది కొలంబియా వాసులు ఉన్నారు. దీని సామర్థ్యం 3,900 కాగా.. 11,778 మంది ఖైదీలు ఇక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో జైలుపై దుండగులు దాడి నిర్వహించారు. దీనిలో బాజ్-5 ముఠా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు.