ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్. ఈ కేసులో తన అరెస్టు అక్రమమని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కేజ్రీవాల్ పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
మరోవైపు కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు తాజాగా వెలువరించింది.
ఈ తీర్పులో భాగంగా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్ర పన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణంతో లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీ వాల్ అరెస్టు సబబేనని పేర్కొంది. ట్రయల్ కోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కు ఉంటుందని.. వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి క్రాస్ ఎగ్జామిన్కు సమాధానం చెప్పాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక వ్యక్తి సౌలభ్యం ప్రకారం విచారణ జరపాలని కోర్టు.. దర్యాప్తు సంస్థను ఆదేశించలేదని.. దర్యాప్తు సంస్థ తన విధానం ప్రకారం నడుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ను కోర్టు పరిశీలించాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి దారి తీసిన ఘటనలు, తగినంత మెటీరియల్ ఈడీ కలిగి ఉందని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించకపోవడం, ఆయన వల్ల జరిగిన జాప్యం కూడా జ్యూడీషియల్ కస్టడీలో ఉండ టానికి కారణమని హైకోర్టు భావించింది. తీర్పు ఎప్పుడూ చట్ట ప్రకారమే ఇవ్వబడతాయి కానీ.. రాజకీయం గా కాదని తెలిపింది. ప్రస్తుతం కోర్టు ముందున్న అంశం.. కేంద్ర ప్రభుత్వానికి, కేజ్రీవాల్కి మధ్య వివాదం కాదని.. ఇది కేజ్రీవాల్, ఈడీకి మధ్య ఉన్న కేసని తెలిపింది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కు లేవీ ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకు, సీఎంకు చట్టం ఒకటేనని తెలిపింది. లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత.. కోర్టు కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 దాకా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్నారు.


