లోక్ సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ కు దేశం సిద్ధమైంది. మరో పక్క రెండో దశ పోలింగ్ కు సన్నాహాలు పూర్తవుతున్నాయి. దేశం మొత్తంమీద ఎన్నికల వేడి.. ఎండవేడిమిని దాటి సాగుతోంది. విడతలతో సంబంధంలేకుండా రాజకీయనాయకులు అన్నిరాష్ట్రాల్లోనూ సుడిగాలిపర్యటనలు చేస్తూ.. జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ముమ్మర ప్రచారం సాగుతోంది.
2024 లోక్ సభ ఎన్నికలు ప్రచారం జోరందుతుంది. రెండో విడత నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రెండో దశలో పోటీ పడుతున్న ప్రముఖుల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, కేరళ నుంచే సీపీఐ జనరల్ సెక్రటరీ డి. రాజా సతీమణి అన్ని రాజా, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సినీ నటుడు సురేశ్ గోపీ వంటి వారు ఉన్నారు. కేరళ వాయినాడ్ నుంచి రాహుల్ గాంధీ, రాజస్థాన్ కోటా నుంచి స్పీకర్ ఓం బిర్లా ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. కేరళలోనే పథని తిట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఆంటో ఆంటోనీ పోటీ చేస్తుంటే.. అదే నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ కె. ఆంటోని బీజేపీ నుంచి పోటీ చేయడం విశేషం.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ ఏప్రిల్ 19న మొత్తం 102 నియోజకవర్గాలకు తొలిదశ పోలింగ్ జరుగుతుంటే.. రెండో దశ పోలింగ్ కు సన్నాహాలు పూర్తవుతున్నాయి. రెండో దశలో ఏప్రిల్ 26 వ తేదీన దాదాపు 12 రాష్ట్రాలలోని 88 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఒక్క బీహార్ లోని 5 నియోజకవర్గాలకు ఏప్రిల్ 25నే రెండోదశ పోలింగ్ జరుగు తుంది. నామినేషన్ల పర్వం పూర్తయింది. 12 రాష్ట్రాలలో మణిపూర్ లో మాత్రం రెండు నియోజకవర్గాల్లో ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి పూర్తిగా, ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలోని సగభాగానికి ఏప్రిల్ 19 న పోలింగ్ జరుగుతుండగా, ఏప్రిల్ 26న ఔటర్ మణిపూర్ స్థానంలోని మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ నిర్వహిం చనున్నారు.
పార్లమెంటు ఎన్నికలు రెండో దశలో అసోంలో 5, బీహార్ లో 5 చత్తీస్ గఢ్ లో 3 కర్ణాటకలో 14, కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్ లో 7, మహారాష్ట్రలో 8, రాజస్థాన్ లో 13, ఉత్తరప్రదేశ్ లో 8, పశ్చిమ బెంగాల్ లో 3, జమ్మూ కశ్మీర్ , త్రిపుర, లక్షద్వీప్, పాండిచ్చేరి , అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కో నియోజకవర్గాలకు, మణిపూర్ లో ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో సగం పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 88 నియోజకవర్గాలకు మొత్తం 2,633 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 1428 నామినేషన్లను పరిశీలన అనంతరం తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత చివరకు 1,210 మంది అభ్యర్థులు రంగంలోకి నిలిచారు.
కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలకు మొత్తం 500 మంది బరిలో ఉన్నారు. కర్ణాటకలో రెండోవిడత పోలింగ్ జరిగే 14 నియోజకవర్గాల్లోనూ491 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఒక్క నియోజకవర్గంలోనే అత్యధికంగా 92 మంది అభ్యర్థులు పోటీపడు తున్నారు. మొదటి దశలో 102 నియోజకవర్గా లకు, ఔటర్ మణిపూర్ లోని సగంనియోజక వర్గానికి, రెండో దశలో 88 స్థానాలు, ఔటర్ మణిపూర్ నియోజకవర్గం సగ భాగానికి ఎన్నికలు పూర్తయితే 190 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది.


