ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలలు సమయం ఉన్నా.. రాజకీయ వేడి మాత్రం ఇప్పటికే తీవ్రస్థాయిలో కన్పిస్తోంది. దీనికితోడు చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ పాలిటిక్స్లో మరింత హీట్ పెంచేసింది. ఈ పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మరోసారి అడుగులో అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో అప్పటికే నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 9న బాబు అరెస్టు సమయానికి కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో పాదయాత్ర చేస్తున్న లోకేష్.. అక్కడికక్కడే తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
పాదయాత్రకు విరామం ఇచ్చిన తర్వాత చంద్రబాబు కేసుపై లాయర్లతో చర్చించడం, పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం చేశారు లోకేష్. అయితే.. ఇటీవలె చంద్రబాబుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ దొరకడంతో తిరిగి తన పాదయాత్రను పున:ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ఎక్కడైతే తన పాదయాత్రను ఆపేశారో తిరిగి అక్కడ్నుంచే ఈనెల 27న ప్రారంభించనున్నారాయన. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసింది టీడీపీ. పొదలాడలో ప్రారంభం కానున్న పాదయాత్ర మొదటి రోజు 15 కిలోమీటర్ల మేర సాగనుంది.
మారిన పరిస్థితుల్లో లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సైతం కొంత మేర మారింది. ఈ మ్యాప్ను పరిశీలిస్తే.. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతరం అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల నుంచి సాగే పాదయాత్ర విశాఖలో ముగియనుంది. నిజానికి.. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో యువగళం పేరుతో మొదలైన యాత్ర 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు పూర్తిచేయాలన్న లక్ష్యంతో మొదలైంది. అందుకు తగ్గట్లుగానే రూటు మ్యాప్ను రూపొందించారు. 208 రోజుల్లో 2 వేల 852 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశారు లోకేష్. మొత్తం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 84 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. అయితే..మధ్యలో చంద్రబాబు అరెస్టు, పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ కోసం రెండున్నర నెలల పాటు విరామం ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని భావించి మళ్లీ యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు నారా లోకేష్.