తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగు రోజుల పండుగలో వాడవాడలా భోగి మంటలు వేసి పండగను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇళ్ల ముందు రంగులతో ముగ్గులు వేసి మహిళలు పండుగకు స్వాగతం పలికారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక ఏపీలోని గోదావరి జిల్లాల్లో కోడి పందేలు కూడా అంతే సందడిగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురంలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెల్లోని బరుల్లోనూ పందేలు ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. నందిగామ, చందర్లపాడులో ఈ పోటీలు సాగుతున్నాయి. కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద టెంట్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో కోడి పందేలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు.