ఉత్తరప్రదేశ్లోని కీలకమైన 14 లోక్సభ నియోజకవర్గాల్లో ఈనెల 25న పోలింగ్ జరగనుంది. 14 నియోజకవర్గాలకు గాను మొత్తం 162 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కిందటిసారి ఎన్నికల్లో ఈ 14 సెగ్మెంట్లలో తొమ్మిది నియోజకవర్గాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ నాలుగు సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. కాగా సమాజ్వాదీ పార్టీ ఒక్క సీటు గెలుచుకుంది. ఈ 14 నియోజకవర్గాలు పూర్వాంచల్ ప్రాంతంలో ఉండటం విశేషం.
అంబేద్కర్ నగర్ నియోజకవర్గం నుంచి 2019లో బహుజన్ సమాజ్పార్టీ విజయం సాధించింది. ఈసారి ఇక్కడ్నుంచి బీజేపీ టికెట్పై రితేశ్ పాండే పోటీలో ఉన్నారు. అలాగే సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా లాల్జీవర్మ, బీఎస్పీ నుంచి ఖమర్ హయత్ పోటీలో ఉన్నారు. దేశంలోనే ఉసిరి ఉత్పత్తికి ప్రతాప్గఢ్ నియోజక వర్గం పేరు తెచ్చుకుంది. నియోజకవర్గంలో దళితులు, ముస్లింల ఆధిపత్యం ఎక్కువ. దళితులు 19.9శాతం ఉంటే, ముస్లింలు 14 శాతం ఉన్నారు. ప్రతాప్గఢ్ నుంచి 2019లో బీజేపీ విజయం సాధించింది. ఈసారి బీజేపీ తరఫున సంగంలాల్ గుప్తా, సమాజ్వాదీ పార్టీ నుంచి శివ్పాల్ సింగ్ పటేల్ బరిలో ఉన్నారు. అయోధ్య రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు, నరేంద్ర మోడీ ఇమేజ్ ఈసారి ఎన్నికల్లో ప్రతాప్గఢ్ లో కీలకాంశాలుగా మారాయి.
జౌన్పుర్ నియోజకవర్గం గోమతీ తీరాన ఉంది. ఇక్కడి స్వీట్లు దేశమంతా పాపులర్. 2014 లో బీజేపీ ఇక్కడ్నుంచి గెలిచింది. కాగా 2019లో బహుజన్ సమాజ్ పార్టీ గెలిచింది. ఈసారి బీజేపీ తరఫున కృపాశంకర్ సింగ్ అలాగే సమాజ్వాదీ పార్టీ నుంచి బాబు సింగ్ కుశ్వాహా, బీఎస్సీ అభ్యర్థిగా శ్యాం సింగ్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. పూల్పుర్ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పోటీ చేసిన నియోజకవర్గం ఇది. పండిట్ నెహ్రూ ఇక్కడ్నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు. ఓబీసీలే ఇక్కడ విజేతలను నిర్ణయిస్తారు. 2014 అలాగే 2019 ఎన్నికల్లో ఫూల్పుర్ నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధించింది. అయితే 2018లో జరిగిన ఉప ఎన్నికలో పూల్పుర్ నుంచి సమాజ్వాదీ పార్టీ విజయం సాధించింది. ఈసారి బీజేపీ నుంచి ప్రవీణ్ పటేల్ , సమాజ్వాదీ పార్టీ నుంచి అమర్నాథ్ సింగ్ మౌర్య, బీఎస్సీ టికెట్ పై జగన్నాథ్ పాల్ పోటీ చేస్తున్నారు.
లాల్గంజ్ మరో నియోజకవర్గం. ఈ సెగ్మెంట్ను ఎస్సీలకు రిజర్వు చేశారు. 2014లో కమలం పార్టీ గెలిస్తే 2019 లో బీఎస్సీ ఇక్కడ్నుంచి గెలిచింది. ఈసారి బీజేపీ తరఫున నీలం సోంకర్, సమాజ్వాదీ పార్టీ నుంచి దరోగా ప్రసాద్ సరోజ బరిలో ఉన్నారు. అలహాబాద్ ఉత్తరప్రదేశ్లోని ఓ కీలక నియోజకవర్గం ఇది. మురళీ మనోహర్ జోషి, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు అలహాబాద్ నుంచి గతంలో పోటీ చేశారు. గంగా,యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం అలహాబాద్. ఈసారి బీజేపీ అభ్యర్థిగా నీరజ్ త్రిపాఠి, కాంగ్రెస్ నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్, బీఎస్పీ టికెట్ పై రమేశ్ కుమార్ పటేల్ పోటీలో ఉన్నారు. అయితే ఈ ముగ్గురూ లోక్సభ ఎన్నికలకు కొత్తవారే కావడం విశేషం. నేపాల్ సరిహద్దుల్లో శ్రావస్తీ నియోజకవర్గం ఉంది. శ్రావస్తీ నియోజకవర్గానికి దేశంలోనే అతి పెద్ద బౌద్ద క్షేత్రంగా పేరుంది. 2019లో ఇక్కడ్నుంచి బీఎస్పీ గెలిచింది, ఈసారి బీజేపీ అభ్యర్తిగా సాకేత్ మిశ్రా, సమాజ్ వాదీ పార్టీ టికెట్పై రాం శిరోమణి వర్మ పోటీలో ఉన్నారు. శ్రావస్తీ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని అత్యంత వెనుకబడిన నియోజక వర్గాల్లో ఒకటి.ఇవికాక డుయారియా గంజ్, సంత్ కబీర్ నగర్, ఆజంగఢ్, మచిలీ శహర్, భదోహీ నియోజకవర్గాల్లో కూడా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి.