సీనియర్ రాజకీయవేత్త గులాం నబీ ఆజాద్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ తరఫున అనంతనాగ్ – రాజౌరి లోక్సభ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచిన ఆజాద్ ఇటీవల పోటీ నుంచి వైదొలగారు. గులాం నబీ ఆజాద్ చివరిక్షణంలో పోటీ నుంచి వైదొలడం రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. ఈనెల 25న ఇక్కడ పోలింగ్ జరగనుంది. అనంతనాగ్ – రాజౌరి లోక్సభ సెగ్మెంట్ నుంచి పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ టికెట్పై మాజీ ముఖ్య మంత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మెహబూబా ముఫ్తీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు.
కాశ్మీర్లోని అనంతనాగ్ – రాజౌరి లోక్సభ నియోజకవర్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టు కుంటోంది. ఇక్కడ్నుంచి రద్దయిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ నిన్న మొన్నటివరకు పోటీలో ఉన్నారు. అయితే కిందటినెలలో ఆయన పోటీ నుంచి వైదొలగినట్లు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆజాద్ ఎందుకు పోటీ చేయడంలేదో వెల్లడించ లేదు డీపీఏపీ వర్గాలు. అనంతనాగ్ – రాజౌరి సెగ్మెంట్ నుంచి పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ పీడీపీ అధ్యక్షురా లు మెహబూబా ముఫ్తీ బరిలో నిలిచారు. మెహబూబా ముఫ్తీ కూడా గతంలో ముఖ్యమంత్రి హోదాలో జమ్మూ కాశ్మీర్కు సేవలందించారు. అయితే గులాం నబీ ఆజాద్ అకస్మాత్తుగా పోటీ నుంచి ఉపసం హరించుకోవడంతో డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ తరఫున న్యాయవాది మహమ్మద్ సలీమ్ పారే బరిలో నిలిచారు.
ఇదిలాఉంటే ప్రత్యక్ష రాజకీయాలకు ఆజాద్ త్వరలో స్వస్తి చెబుతారన్న ఊహాగానాలు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి. గులాం నబీ ఆజాద్ పేరు ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ పాత వారికి పరిచయం అక్కర్లేని పేరు. కాంగ్రెస్ పార్టీలో ఆజాద్ చాలాకాలం పాటు కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏ సంక్షోభం తలెత్తినా అధిష్టానానికి వెంటనే గుర్తుకువచ్చే పేరు గులాం నబీ ఆజాదే. సమర్థుడైన సంక్షోభ పరిష్కర్తగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ గులాం నబీ ఆజాద్ చాలా పాపులర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నాయకులకు ఆజాద్తో సన్నిహిత సంబంధాలున్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఆజాద్ శిష్యులే అంటారు రాజకీయ పరిశీలకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హవాను తట్టుకుని కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ఆజాద్ది కీలక పాత్ర. అలనాటి కాంగ్రెస్ నాయకుల బస్సు యాత్ర ఆలోచన కూడా ఆజాద్ దే అంటారు కాంగ్రెస్ రాజకీ యాల గురించి బాగా తెలిసినవాళ్లు. ఆ జాదూ ఫలించేనా అని అప్పటి తెలుగు పేపర్లలో తరచూ హెడ్డింగులు కనిపించేవి. రాజకీయంగా టక్కు టమార విద్యల్లో ఆజాద్ అందెవేసిన చెయ్యి అంటారు ఆయన గురించి తెలిసినవాళ్లు. దాదాపు రెండేళ్ల కిందటి వరకు ఆజాద్ కాంగ్రెస్లో కొనసాగారు.
2022లో అగ్రనేత రాహుల్ గాంధీతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్కు గులాం నబీ ఆజాద్ గుడ్బై కొట్టారు. ఒకదశలో బీజేపీలోకి ఆయన ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం కూడా నడిచింది. అయితే ఎందుకనోగానీ, ఆజాద్ కాషాయ కండువా కప్పుకోలేదు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ డీపీఏపీ పేరుతో ఆజాద్ స్వంత పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై కొట్టిన తరువాత కాశ్మీర్లోయలో ప్రజలు తనకు హారతులు పడతారని ఆజాద్ భావించి ఉండొచ్చు. అయితే ఆజాద్ అంచనాలు తల్లకిందులు అయ్యాయి. ఆజాద్ మూలాలు కాశ్మీర్ లోయలో ఉన్నప్పటికీ, అక్కడ ఆయన తనకంటూ పటిష్టమైన కోటను నిర్మింపచేసుకోలేకపోయారు. ఆజాద్ను కాంగ్రెస్ హై కమాండ్ మనిషిగానే కాశ్మీరీలు చూశారు. ఈసారి ఎన్నికలో గెలుపు అంత సులభం కాదన్న సంకేతాలు కూడా వెలువడ్డాయంటారు రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలో పోటీ చేసి ఓడిపోవడం కంటే, బరినుంచి వైదొలగడమే మంచిదని ఆజాద్ భావించి ఉండొచ్చు అంటున్నారు పరిశీలకులు.
గులాం నబీ ఆజాద్ కొంతకాలం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. ముఖ్యమంత్రి హోదాలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కి ఆజాద్ విశేష కృషి చేశారు. ఆజాద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకదశలో కాశ్మీర్ లో టెర్రరిస్టులు పెట్రేగిపోయారు.పెద్ద సంఖ్యలో అమాయకులైన గుజరాతీయులను పొట్టన బెట్టుకున్నారు. ఈ దారుణానికి ఆజాద్ చలించిపోయారు. అధికారుల మీద బాధ్యతలు వదలకుండా మృతదేహాలను గుజరాత్ కు పంపే బాధ్యతను తానే నెత్తిమీద వేసుకున్నారు. అప్పట్లో గుజరాత్ కు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆనాడు మృతదేహాలను ను గుజరాత్ సర్కార్ కు అప్పగించేంత వరకు ఆజాద్ నిద్రాహారాలు లేకుండా ఎలా పనిచేశారో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుకుతెచ్చు కుంటారు. రాజ్యసభ సభ్యుడిగా గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ చేస్తున్నప్పుడు. ఇదే సంఘటనను గుర్తుకు తెచ్చుకుని నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనవడం యావత్ భారతదేశం చూసింది. అనంతనాగ్ – రాజౌరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మెహబూబా ముఫ్తీ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ టికెట్పై మియా అల్తాఫ్, అప్నీ పార్టీ తరఫున జఫర్ ఇక్బాల్ మన్హాస్ పోటీలో ఉన్నారు. కాశ్మీర్లోని శ్రీనగర్, బారాముల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ పోలింగ్ నమోదైంది. దీంతో ఈసారి అనంతనాగ్ – రాజౌరి నియోజకవర్గంలో ఓటింగ్ ఎలా ఉంటుందన్నదానిపైనా ఆసక్తి నెల కొంది. అనంతనాగ్ – రాజౌరి నియోజకవర్గం మొదట్లో అనంతనాగ్ పేరుతో ఈ నియోజకవర్గం ఉండేది. అప్పట్లో కాశ్మీర్ లోయలోని జిల్లాలే ఈ నియోజకవర్గంలో భాగంగా ఉండేవి. అయితే లోయలోని అనంతనాగ్ ప్రాంతాన్ని, జమ్మూలోని రాజౌరీ, పూంచ్లను కలిపి అనంతనాగ్ – రాజౌరీ పేరుతో కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికంగా జనాభా సమీకర ణాలు మారిపోయాయి. ప్రస్తుతం ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 18 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి.
అనంతనాగ్ – రాజౌరి నియోజకవర్గంపై పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి మొదట్నుంచీ గట్టి పట్టుంది. ఇక్కడ్నుంచి 2004, 2014 ఎన్నికల్లో మెహబూబా ముఫ్తీ విజయం సాధించారు. ఈసారి ఎన్నికలను మెహబూబా ముఫ్తీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో తానే ఎన్నికల బరిలోకి దిగారు. నేషనల్ కాన్ఫ రెన్స్ నుంచి మెహబూబా ముఫ్తీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఇండియా కూటమిలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ రెండూ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.అనంతనాగ్ – రాజౌరి నియోజకవర్గంలో నేషనల్ కాన్ఫరెన్స్ తనకు మద్దతు ఇస్తుందని మెహబూబా ముఫ్తీ మొదట్లో భావిం చారు. అయితే పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి నేషనల్ కాన్ఫరెన్స్ తన అభ్యర్థిని బరిలోకి దించింది.