ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. భారత్, రష్యాల మధ్య మైత్రీ బంధాన్ని కొనసాగించే నేపథ్యంలో నిర్వహించిన 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన సోమవారం రష్యాకు వెళ్లారు. కాసేపట్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించి విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
పుతిన్తో భేటీ అనంతరం దౌత్య, అధికారిక బృందాలతో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య పటిష్ట మైత్రి, సహకార బంధంపై సమగ్ర, లోతైన చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం అంశం చర్చకు వచ్చే అవకాశముండటంతో దీనిపై కూడా మాట్లాడనున్నారు మోదీ. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకొచ్చే ఛాన్స్ ఉంది.
రెండ్రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి అధికారులు సాదర స్వాగతం పలికారు. రష్యన్ డ్యాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దాండియా, గర్భా నృత్యంతో మోదీకి వెల్కమ్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ మాస్కో వెళ్లారు. ఇక మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. శిఖరాగ్ర భేటీ అనంతరం అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఆ తర్వాత రష్యా పర్యటనను ముగించుకుని మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం.