సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఒకటి బొద్దింక జనతా పార్టీ , మరొకటి నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్ .మరో వైపు ప్రధాన న్యామూర్తి సూర్య కాంత్ మాత్రం తాను అలా అనలేదని చెప్పినా వినే పరిస్ధితి లేనట్లు కనిపిస్తోంది.
ఏదైనా వివాదాన్ని పట్టుకుని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయటం ఇప్పుడు నయా ట్రెండ్ గా మారింది. ఆ కోవలోకే వస్తాయి మనం చెప్పుకునే ఈ రెండు రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. బొద్దింక జనతా పార్టీ , నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్ అనే ఈ రెండు వ్యంగ్య రాజకీయ సంస్థలు ఆన్లైన్లో చర్చనీయాంశం అవుతున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే, ఈ రెండు సంస్థలూ తాము వ్యంగ్య సంస్థలమని చెప్పుకుంటున్నాయి. కానీ అన్ని గొప్ప భారతీయ రాజకీయ వ్యంగ్యాల మాదిరిగానే, వాటి వెనుక ఉన్న కథలు నిజమైనవి కాబట్టే వాటి జోకులు ప్రభావవంతంగా ఉంటున్నాయి.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోలుస్తూ వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. ఇది ఇంటర్నెట్లో వ్యంగ్యాస్త్రాల వెల్లువకు దారితీసింది. దీని ఫలితంగా, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ప్రతిచోటా ప్రధాన కార్యాలయాన్ని కలిగి, తమను తాము సోమరులు , నిరుద్యోగుల గొంతుకగా అభివర్ణించుకునే బొద్దింకల జనతా పార్టీ ఆవిర్భవించింది.ఆన్లైన్లో సాధారణంగా NPF అని పిలవబడే నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్, తనను తాను సంప్రదాయ రాజకీయాలను , వైరల్ బొద్దింక జనతా పార్టీని సవాలు చేసే ఒక వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా అభివర్ణించుకుంటుంది.
వ్యవస్థ చేసిన అవమానాన్నే ఆయుధంగా మలచుకుని అమెరికా యువకుడు అభిజీత్ దిప్కే ప్రారంభించిన ‘బొద్దింక జనతా పార్టీ’ (CJP) సరికొత్త సంచలనాలకు తెరలేపింది. కేవలం ఐదు రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో కోటి మంది ఫాలోవర్లను సాధించి అధికార బీజేపీ అధికారిక ఖాతాను సైతం దాటేయడం ఈ వ్యంగ్య పార్టీ క్రేజ్కు అద్దం పడుతోంది. ఈ ఊహించని సక్సెస్ వెనుక కేవలం వ్యంగ్యం మాత్రమే లేదు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ నిరుద్యోగ యువతకు ఉన్న తీవ్రమైన కోపం, నిరాశ దాగి ఉన్నాయి. ఎక్స్ (ట్విట్టర్) లో ఈ అకౌంట్ను బ్యాన్ చేయించినా, ‘బొద్దింకలు చావవు’ అంటూ గంటల్లోనే కొత్త ఖాతాతో రీ-ఎంట్రీ ఇచ్చి డిజిటల్ యుగంలో యువతను ఆపలేరని నిరూపించారు. కమలం పువ్వును బొద్దింక కొరుకుతున్న చిత్రం వైరల్ కావడంతో అటు అధికార బీజేపీకి, ఇటు తామే టాప్ అనుకుంటున్న ప్రతిపక్ష కాంగ్రెస్కు ఈ వ్యవహారం పెద్ద సవాల్గా మారింది.


