మరో మహమ్మారి పంజా విసరబోతుందా…? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించబోతుందా? వేలల్లో మృత్యువాత పడడం చూడబోతున్నామా? ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు ఏం సూచిస్తున్నాయి? భారత్లో కేంద్ర ప్రభుత్వ అలసత్వ ధోరణి మళ్లీ కోవిడ్ పరిస్థితులు తప్పవని చెబుతున్నాయా?
అది 2019 సెప్టెంబర్.. చైనాలోని వ్యూహాన్లో ఓ మార్కెట్లో ప్రమాదకర వైరస్ను గుర్తించారు.. దానికి కోవిడ్ 19గా నామకరణం చేశారు. అది మెల్లగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. పదులు,, వందలు,, వేల సంఖ్యల్లో ఆ వైరస్ బారిన పడ్డారు. ఆ వ్యాధికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ లేదు. టీకా కూడా లేదు. ఆస్పత్రులు నిండిపోయాయి. బెడ్లు ఖాళీ లేవు, ట్రీట్మెంట్ అందించే వైద్యులు ఆ వైరస్ బారిన పడ్డారు. ఒక్కొక్కరుగా మృత్యువాత పడటం మొదలైంది.మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇతర దేశాలకు కూడా వైరస్ పాకింది.
చైనా మన పొరుగు దేశమే కావడంతో మనలోనూ కలవరం మొదలైంది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ మనదేశంలో కూడా వ్యాపించిందని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని …. కానీ ఆ వైరస్ వల్ల ఇండియాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. మనదేశంలో అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఎయిర్పోర్టుల్లో ప్రయణికులను క్వారంటైన్కు తరలించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
అప్పటికే ప్రపంచ దేశాలు దాదాపు కరోనా వైరస్ బారిన పడ్డాయి. పలు దేశాల్లో ఊహించని విధంగా మరణాల రేట్లు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరగడంతో అరికట్టేందుకు ఒక్కొక్క దేశాలు లాక్డౌన్కు వెళ్లిపోయాయి. అప్పుడు మొదలైన ప్రజల కష్టాలు సుమారు ఏడాది పాటు సాధారణ స్థితికి చేరుకోలేకపోయాయి.
ఇక భారత్లో 2019 డిసెంబర్లో మొదటి కేసు నమోదైంది. 2020 జనవరిలో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కోవిడ్ పూర్తిగా నియంత్రణలోనే ఉందని తెలిపింది. ఎయిర్పోర్టుల్లో స్క్రీన్ టెస్టులు నిర్వహిస్తున్నామని.. ఇతర దేశాల నుంచి వచ్చే వారి ద్వారా మనదేశంలోకి వైరస్ ప్రవేశించే ఛాన్స్ లేదని చెప్పారు. ఇంత చెప్పిన ప్రభుత్వం.. కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోయింది. దీంతో వైరస్ దావనంలా వ్యాపించింది. ఒకరి నుంచి ఒకరికి విపరీతంగా వ్యాప్తి చెందడంతో లక్షల్లో జనాలు కరోనా బారిన పడ్డారు. కుటుంబంలో కనీసం ఒకరికైనా వైరస్ సోకడంతో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమందికి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు లభించక ప్రాణాలు వదిలారు. తమ కళ్లముందే తమ ఆత్మీయులు ప్రాణాలు కోల్పోతుంటే మౌనంగా రోదించారు. ఇదే పరిస్థితుల్లో కేంద్రం లాక్డౌన్ విధించింది. ఇంకేముంది.. జనం నిత్యావసరాలకు నానా అవస్థలు పడ్డారు. దినసరి కూలీలు పనులు దొరక్క అల్లాడిపోయారు. కోవిడ్ రోజుల్లో దేశ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
ప్రస్తుతం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఆఫ్రికా ఖండంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. కేంద్రం కూడా ఎయిర్పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. ఆఫ్రికా నుంచి వచ్చే వారికి స్క్రీన్ టెస్టులు చేస్తున్నామని.. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఇది కోవిడ్ పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి.
కొవిడ్ కంటే ఎబోలా ఇంకా డేంజర్.. వైరస్తో బాధపడుతున్న వారిని తాకితే చాలు వైరస్ వ్యాపిస్తుంది. కొవిడ్ ను ఉదాహరణగా తీసుకుని కేంద్రం అలర్ట్ అవ్వాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే పకడ్బందీ చర్యలతో ముందే వైరస్ను అరికట్టగలగాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లాక్డౌన్ పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే కేంద్రం ఇప్పుడే అప్రమత్తమవ్వాలి. ఎబోలా వ్యాప్తి చెందకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కేసును గుర్తించినా … ఒకటే అని కొట్టిపారేయకుండా నియంత్రణపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


