వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కల దాడుల భయంలేకుండా ప్రజలకు జీవించే హక్కు ఉందని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై ప్రేక్షకుల్లా ఉండకూడదని హెచ్చరించింది. వీధి కుక్కలను బహిరంగ ప్రదేశాల నుంచి తరలించాలంటూ 2025 నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. స్టెరిలైజేషన్ చేసిన తర్వాత కూడా కుక్కలను తిరిగి అదే ప్రాంతాల్లో వదలకూడదన్న గత ఉత్తర్వులను కొనసాగించింది.
జంతు హక్కుల సంఘాలు మాత్రం స్టెరిలైజేషన్ అనంతరం కుక్కలను వేరే ప్రాంతాలకు తరలించడం వల్ల అవి గందరగోళానికి గురై మరింత దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని వాదించాయి. అయితే ఈ వాదనలను కోర్టు తిరస్కరించింది.
“చిన్నపిల్లలు, వృద్ధులు, విదేశీ పర్యాటకులు కూడా వీధి కుక్కల దాడులకు గురవుతున్న వాస్తవ పరిస్థితులను విస్మరించలేం. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి శారీరక బలం లేదా అదృష్టంపై ఆధారపడే సమాజాన్ని రాజ్యాంగం ఊహించలేదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వీధి కుక్కలు ప్రజా ప్రదేశాల్లో అధిక సంఖ్యలో తిరగడం ఆందోళనకరమని పేర్కొన్న కోర్టు, జంతు సంక్షేమ బోర్డు (AWBI) మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే గతంలో ఇచ్చిన సూచనలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్నా తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు సరైన ప్రణాళిక లేకుండా జరిగాయని కోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు
1..అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు AWBI నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
2..ప్రతి జిల్లాలో కనీసం ఒక Animal Birth Control కేంద్రం ఏర్పాటు చేయాలి
3…యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు, ఇమ్యూనోగ్లోబులిన్లు తగినంతగా అందుబాటులో ఉంచాలి
4…ఈ ఆదేశాలు అమలు చేసే అధికారులపై సాధారణంగా పోలీస్ కేసులు నమోదు చేయకూడదు
2025 నవంబర్లో ఏమి జరిగింది?
గత ఏడాది సుప్రీంకోర్టు ఆస్పత్రులు, పార్కులు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించి షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్ అనంతరం కూడా వాటిని తిరిగి అదే ప్రాంతాల్లో వదలరాదని స్పష్టం చేసింది. అలాగే ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని కూడా నిషేధించి, ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే అనుమతించింది.
ఇక జూలైలో ఢిల్లీ , పరిసర ప్రాంతాల్లోని వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుంచి తరలించి షెల్టర్లలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఈ చర్యలకు అడ్డంకులు సృష్టించే వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.


