టెక్ దిగ్గజ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అభద్రతాభావంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితుల్లో వారు ప్రతి రోజు దినదినగండంగా గడుపుతున్నారు. వచ్చే త్రైమాసికంలో తమ ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియక వారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు Meta లేదా LinkedInలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పడం చాలా గర్వకారణంగా ఉండేదని… అధిక వేతనాలు, అద్భుతమైన సౌకర్యాలు, జీవితంలో స్థిరపడ్డామనే భావన … ఇవన్నీ గుర్తింపుగా ఉండేవని చెబుతున్నారు . కానీ పరిస్థితి ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కంపెనీల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు ప్రతి ఉదయం భయంతోనే నిద్ర లేస్తున్నామని అంటున్నారు.
తాజాగా మెటా 8 వేల మంది ఉద్యోగులను తొలగించింది. లింక్డ్ఇన్ కూడా 600 మందిని తీసేసింది. దీంతో ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియక ఆయా కంపెనీల ఉద్యోగులు మానసికంగా ఆందోళన చెందుతున్నారు.
ప్రతి రోజు ఉదయం ఆఫీసుకి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకునే ముందు కంపెనీ మెయిల్స్ చెక్ చేస్తున్నామని కొంతమంది ఉద్యోగులు అంటున్నారు. బాత్రూంలో స్నానం చేస్తూ ఏడుస్తానని…. కానీ ఆఫీసులో మాత్రం ధైర్యంగా ఉంటానని ఓ ఉద్యోగి అంటున్నారు.
అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం ఒక తీవ్రమైన మానసిక వ్యాధిలాంటిదని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా కుటుంబ పోషణ భారాన్ని మోస్తున్న వ్యక్తుల్లో ఇది ఆందోళన, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.
ఏఐతో మారుతున్న పరిస్థితులు
మహారాష్ట్రకు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు శుభమ్ భమారే మాట్లాడుతూ.. మెటా సంస్థ ఇప్పుడు ఏఐపై దృష్టి పెట్టిందని అంటున్నారు. ఆటోమేటెడ్ రిప్లై సిస్టమ్ను కూడా అమలు చేశారు. అంటే అక్కడ కూడా ఏఐ మానవ ఉద్యోగాలను భర్తీ చేస్తోందని తెలిపారు.
AIపై ఫోకస్ చేసిన మెటా
మెటా CEO మార్క్ జుకర్బర్గ్ ప్రస్తుతం AI పై పూర్తి దృష్టి సారించారు. ఈ ఏడాది సంస్థ AI అభివృద్ధి కోసం 125 నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఉద్యోగాల కోతల వార్తలు బయటకు రావడంతో మెటా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొంతమంది ఉద్యోగులు అధికారిక ప్రకటన రాకముందే ఆఫీసులో ఉచితంగా ఇచ్చే స్నాక్స్, అదనపు ల్యాప్టాప్ ఛార్జర్లు తీసుకెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మరో వివాదాస్పద అంశం బయటపడింది.
కొత్త AI వ్యవస్థలను ట్రెయిన్ చేయడానికి ఉద్యోగుల మౌస్ కదలికలు, కీబోర్డ్ టైపింగ్ వివరాలను ట్రాక్ చేసే అంతర్గత టూల్ను మెటా ఉపయోగిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వెయ్యికి పైగా ఉద్యోగులు దీనికి వ్యతిరేకంగా పిటిషన్పై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.


