అమెరికాకు (United States)చెందిన ఓ మహిళ ఇమిగ్రేషన్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన రెండేళ్ల కుమారుడిని విడిచిపెట్టి తనను బలవంతంగా హోండురాస్( Honduras)కు పంపించారని, ఆ తర్వాత తన కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడని ఆమె ఆరోపించింది. అయితే ఇమ్మేగ్రషన్ (Immigration and Customs Enforcement ) అధికారులు మాత్రం ఆమె తన కుమారుడిని వదిలేసి వెళ్లిపోయిందని అంటున్నారు.
హోండురాస్కు చెందిన వెండీ హెర్నాండెజ్ రేయెస్ అనే మహిళ తన కుమారుడు ఓర్లిన్ జోసుయే హెర్నాండెజ్ రేయెస్ను తనతో పంపించాలని అమెరికా అధికారులను వేడుకున్నప్పటికీ.. జనవరిలో తనను ఒంటరిగా డిపోర్ట్ చేశారని తెలిపింది.
ఆ తర్వాత రెండేళ్ల చిన్నారి ఫ్లోరిడాలోని Escambia Countyలో తన మామయ్య వద్ద ఉంటూ మార్చిలో మృతి చెందాడు. అధికారుల వివరాల ప్రకారం చిన్నారి శరీరంపై కాలిన గాయాలు, విరిగిన పక్కటెముకలు, ప్యాంక్రియాస్ తీవ్రంగా దెబ్బతినడం, లైంగిక వేధింపుల ఆనవాళ్లు కనిపించాయి. ఈ కేసులో చిన్నారి మామయ్యను హత్య ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
చిన్నారి మృతి తర్వాత ICE విడుదల చేసిన ప్రకటనలో వెండీ తన కుమారుడిని “వదిలేసి వెళ్లిపోయిందని”, “ఓ హంతకుడి వద్ద చిన్నారిని ఉంచి వెళ్లిందని” ఆరోపించింది. ICE డైరెక్టర్ టాడ్ లైయోన్స్( Todd M Lyons) మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి స్వదేశాలకు వెళ్లే అవకాశం ICE కల్పిస్తుందని, అయినప్పటికీ వెండీ తన కుమారుడిని అక్కడే వదిలేసిందని అన్నారు.
అయితే ఈ ఆరోపణలను వెండీ ఖండించింది. “నా కుమారుడు నా ప్రాణం. నేను అతన్ని ఎలా వదిలేస్తాను? నా బిడ్డతోనే నేను ప్రతిదీ చేసేదాన్ని. నేను నా పిల్లాడిని ఓ హంతకుడి వద్ద వదిలేసే తల్లి కాదు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
జనవరిలో అలబామాలో తన సోదరితో కలిసి పనికి వెళ్తుండగా పోలీసులు తమ వాహనాన్ని ఆపారని వెండీ తెలిపింది. అనంతరం బాల్డ్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఆమెను ICE అధికారులకు అప్పగించింది. 2022లో అమెరికాకు వచ్చి ఆశ్రయం కోరిన వెండీ, ఇమ్మిగ్రేషన్ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఆమె డిపోర్టేషన్కు న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
“నా బిడ్డను నాతో కలపాలని నేను అధికారులను వేడుకున్నాను. నాకు నా కుమారుడు కావాలి” అంటూ వెండీ కన్నీటి పర్యంతమైంది.


