YS Sharmila | నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాతో పనిచేద్దమని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వై.ఎస్. షర్మిల అన్నారు. పార్టీలకు అతీతంగా T-SAVE ద్వారా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాజకీయాల కంటే మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యమన్నారు. ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుందామని.. దయచేసి అన్ని పార్టీలు దీనికోసం కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ నియంత పాలనలో నిరుద్యోగులకు తొమ్మిదేండ్లుగా అన్యాయమే జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి, పోరాడాల్సిన అవసరం ఉందని… ఇందుకోసం T-SAVE ( తెలంగాణ స్టూడెంట్స్ ఆక్షన్ ఫర్ వెకన్సీస్ అండ్ ఎంప్లాయిమెంట్) అనే ఫోరాన్ని ప్రతిపాదిస్తున్నానని తెలిపారు. హౌజ్ అరెస్టులు, అక్రమ కేసులతో KCR నిరంకుశ సర్కారు ప్రశ్నించకుండా, పోరాడకుండా నిర్బంధిస్తోందని అన్నారు. అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి, పోరాడితేనే కేసీఆర్ మెడలు వంచగలం అన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరారు.