జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయిన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు పవన్ కల్యాణ్. కాకినాడ జిల్లా పర్యటనకు వస్తున్న జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లను పూర్తి చేశారు.
హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరానికి చేరుకోనున్న పవన్కల్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన గొల్లప్రోలులోని సత్యకృష్ణ కల్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులోని నివాసానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో జరిగే సమా వేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. రేపు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకూ పంచాయతీరాజ్శాఖ, అనంతరం ఇరిగేషన్ శాఖ, అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు కనెక్టవిటీ, రహదారుల పరిస్థితిపై అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సమావేశం అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుంటారు. అక్కడ జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతారు. జూలై 3వ తేదీన చేబ్రోలు నివాసం నుంచి కొత్తపల్లి మండలం ఉప్పాడ చేరుకుని అక్కడ సముద్రపు కోత ప్రాంతాలను పరిశీలిస్తారు. తిరిగి నివాసానికి చేరుకుని పిఠాపురం నియోజకవర్గ అధికారులతో పరిచయ కార్యక్రమం, అనంతరం టీడీపీ, బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్లో జరిగే వారాహి సభలో పవన్కల్యాణ్ పాల్గొని తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు.