ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్.. మధ్య థియేట్రికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటే.. ప్రొడ్యూసర్స్ రెంటల్ సిస్టమ్ కావాలి అంటున్నారు.. పర్సంటేజ్ సిస్టమ్ కోసం కొన్నాళ్లు ఆగాలని.. అంటున్నారు. అయితే.. ఈ పంచాయితీ మెగా బ్రదర్స్ దగ్గరకు చేరింది. ఎగ్జిబిటర్స్.. మెగాస్టార్ చిరంజీవిని కలిస్తే.. ప్రొడ్యూసర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసారు. దీంతో ఏం జరగనుంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మరి.. ఈ వివాదాన్ని పరిష్కరించేది ఎవరు మెగాస్టారా..? పవర్ స్టారా..?
టాలీవుడ్లో థియేట్రికల్ రెంటల్ విధానం, పర్సంటేజ్ విధానం గురించి గత కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకోవడంతో వివాదం ముదురింది. ఆతర్వాత ఫిల్మ్ ఛాంబర్ రంగంలోకి దిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ కమిటీ కూడా వేసింది. దీంతో సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే.. మళ్లీ మొదటకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సంటేజ్ సిస్టమ్ కావాల్సిందే అని.. దీనికి ఓకే అంటేనే… పెద్ది సినిమాని ప్రదర్శిస్తామని లేదంటే.. ఒక్క థియేటర్లో కూడా పెద్ది సినిమాని ప్రదర్శించమని ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్పడంతో ఈ వివాదం మరింత ముదురింది.
ఆతర్వాత ఎగ్జిబిటర్స్.. మెగాస్టార్ చిరంజీవిని కలిసి పర్సంటేజ్, రెంటల్ సమస్య చెప్పడం జరిగింది. చిరంజీవి నివాసంలో జరిగిన ఈ మీటింగ్లో దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, కె.ఎల్. నారాయణ వంటి నిర్మాతలు కూడా పాల్గొన్నారు. చిరంజీవి.. ఎగ్జిబిటర్స్ చెప్పిన సమస్యలు గురించి విని, మిగిలిన వారితో కూడా చర్చించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆతర్వాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు.
ఎగ్జిబిటర్స్ మెగాస్టార్ చిరంజీవిని కలిస్తే.. ప్రొడ్యూసర్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రాజమండ్రిలో కలిసి ఈ సమస్య గురించి చెప్పడం ఆసక్తిగా మారింది. ఇది హాట్ టాపిక్ అయ్యింది. రవి శంకర్, సితార నాగవంశీ, వెంకట సతీష్ కిలారు, సాహు గరపాటి, సుధాకర్ చెరుకూరి తదితర నిర్మాతలు పవన్ ని కలిసారు. అయితే.. నిర్మాతలు చెప్పింది విన్న పవన్ కళ్యాణ్ ఏమీ కంగారుపడవద్దు.. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నిర్మాతలకు ధైర్యం చెప్పారని తెలిసింది. దీంతో ఈ సమస్యను ఎవరు పరిష్కరించనున్నారు మెగాస్టారా.? పవర్ స్టారా..? అనే చర్చ జరుగుతుంది. జూన్ 4న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కానుంది. అందుచేత వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి.. చిరు, పవన్.. కలిసి మరి కొంత మంది ఇండస్ట్రీ ప్రముఖులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తారేమో చూడాలి.


