లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్లో ఇవాళ కీలక సమావేశం జరుగనుంది. డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి భేటీ కానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి గాంధీ భవన్ వేదికగా అభిప్రాయ సేకరణ తీసుకోనున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందని మున్షీ కాంగ్రెస్ నేతల అభిప్రాయలను సేకరించనున్నారు. ఏఐసీసీ సూచనల మేరకే అభిప్రాయాలను సేకరిస్తు న్నట్టు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఈరోజు జరిగే ఏఐసీసీ సమావేశంలో మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.