స్వతంత్ర, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అవకాశం వచ్చినప్పుడల్లా ధోనీని గంభీర్ విమర్శిస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి మిస్టర్ కూల్పై గౌతీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 2007, 2011 ప్రపంచకప్లలో సమష్టిగా రాణించడం వల్ల భారత్ విశ్వవిజేతగా నిలిస్తే.. కెప్టెన్ ధోనీని హీరోను చేసేశారని విమర్శించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఐసీసీ ట్రోఫీల్లో నెగ్గడం ధోనీకే సాధ్యం అని నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దీనిపై గంభీర్ స్పందిస్తూ.. ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనలకు ఇచ్చిన ప్రాధాన్యం జట్టు ప్రదర్శనకు ఇవ్వకపోవడం వల్లే ఐసీసీ టోర్నమెంట్లలో ఇండియా వరుస వైఫల్యాలు ఎదుర్కొంటుందని తెలిపాడు. వేరే జట్లు మాత్రం సమష్టి ప్రదర్శనతో తమ జట్టును గెలిపిస్తాయన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లో టీమిండియా విజేతగా నిలిచిందంటే ఆల్రౌండర్ యువరాజ్సింగే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ రెండు టోర్నీల్లోనూ యువీనే జట్టును ఫైనల్కు చేర్చాడని.. కానీ పీఆర్ ఏజెన్సీ బృందాలు ధోనీని హీరోని చేసేశాయని గంభీర్ వెల్లడించాడు.