ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అనేక గుణపాఠాలు నేర్పాయి ఫలితాలు. ప్రధానంగా విద్వేష రాజకీయాలను ఏమాత్రం సహించేది లేదని దేశ ప్రజలు తేల్చి చెప్పారు. ముస్లిం వ్యతిరేకత అంశం ఓట్లు రాల్చదని ప్రజలు కుండబద్దలు కొట్టారు. అంతేకాదు రాజ్యాంగాన్ని మార్చడానికి ఎవరు ప్రయత్నించినా, కనీసం ప్రయత్నించినట్లు కనిపించినా సహించేది లేదని స్పష్టం చేశారు ప్రజలు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ, మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా నరేంద్ర మోడీకి ప్రజలు ఇచ్చారు. వరుసగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టడం అంటే చిన్న విషయం కాదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ తరువాత ఆ ఘనతను ఒక్క నరేంద్ర మోడీ సాధించగలిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిన నైతిక బాధ్యత నరేంద్ర మోడీ సర్కార్ పై ఉంది.
గత పదేళ్ల కాలంలో రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా నరేంద్ర మోడీ వ్యవహ రించిందన్న విమర్శలున్నాయి. ప్రధానంగా లోక్సభలో సంఖ్యాబలం ఉండటంతో రాష్ట్రాల హక్కులను హరించే విధంగా నరేంద్ర మోడీ సర్కార్ వ్యవహరించిందన్న ఆరోపణలు మిన్నంటాయి. రాజ్యాంగంలో పొందుపరచుకున్నట్లు భారత్ రాష్ట్రాల సమాహారం. దీంతో సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం పరిరక్షించాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు ఉన్న హక్కులకు పూచీకత్తుగా కేంద్రం వ్యవహరించాల్సి ఉంటుంది.
భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంది. అయినప్పటికీ, మనదేశంలో ఇప్పటికీ నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉంది. ప్రధానంగా నిరుద్యోగం సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడానికి కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే అంటున్నారు సామాజిక వేత్తలు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ప్రపంచంలోనే యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశం భారత్. ఈ నేపథ్యంలో యువత నైపుణ్యాలను దేశ ప్రయోజనాలు, అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకో వాల్సి ఉంటుంది. అప్పుడే అభివృద్ధిలో భారత్, మిగతా దేశాలతో పోటీ పడగలుగుతుంది. అంతేకాదు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఎవరెన్ని కబుర్లు చెప్పినా, దేశానికి అన్నం పెట్టేది రైతన్న. అటువంటి రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా తయారైంది. వానల మీద ఆధారపడి సాగు చేస్తున్నారు అన్నదాతలు. అయితే పంట చేతికి వచ్చేవరకు రైతులకు గ్యారంటీ లేదు. ఏ ప్రకృతి విపత్తు వచ్చినా అన్నదాతల పరిస్థితి ఆగమాగం అవుతోంది.
ఈనేపథ్యంలో వ్యవసాయం లాభసాటి కాదన్న అభిప్రాయం పల్లెల్లో బలంగా నాటుకుంది. దీంతో అయిన కాడికి వ్యవసాయ భూములను అమ్ముకుని సమీపానగల పట్టణాలకు వలస వెళుతున్నారు రైతన్నలు. పట్టణాల్లో కూలీలుగా కొత్త అవతారాలెత్తుతున్నారు. దీంతో ఒక దశలో పల్లెల్లో వ్యవసాయం చేసే రైతులు కరువయ్యారు. అలాగే పంటలకు ఇచ్చే మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని దేశ వ్యాప్తంగా అన్నదాతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దాదాపు మూడేళ్ల కిందట ఢిల్లీ శివార్లలో అన్నదాత లు చేసిన మహోద్యమంలో మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడం అనేది ఒక ప్రధాన అంశం. కొన్ని నెలల కిందట కూడా ఇదే డిమాండ్తో అన్నదాతలు వీథుల్లోకి వచ్చారు. ఆందోళనలు చేశారు. అయితే మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే అంశంపై ఇప్పటివరకు కేంద్రం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. ఇప్పటి కైనా అన్నదాతల చిరకాల డిమాండ్ను పట్టించుకోవాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ సర్కార్ పై ఉంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల అమృతోత్సవాలు జరుపుకున్నప్పటికీ దేశ సంపద మాత్రం ఇప్పటికీ కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. దీంతో సమాజంలో అసమానతలు పెరిగిపోయాయి. ఈ అసమానతలను చెరిపేయాల్సిన బాధ్యత కూడా కేంద్రం పై ఉంది.వర్తమాన సమాజంలో విద్య, వైద్య రంగాలు చాలా కీలకమైనవి. పేదవర్గాలకు ఉన్నత చదువులు ఇప్పటికీ అందని ద్రాక్ష కిందే లెక్క. విద్యారంగాన్ని కార్పొరేట్ కాలేజీలు శాసిస్తున ప్రస్తుత తరుణంలో పెద్ద చదువులు చదవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల ను కూడా పేదవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రానిదే. అలాగే వైద్య రంగం కూడా. ఖరీదైన వ్యాధి వస్తే అందుకు చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత పేదవర్గాలకు ఉండదు. ఈ నేపథ్యంలో పేద, దిగువ మధ్య తరగతివారికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకు రావలసిన అవసరం ఉంది. పేదలు ఎక్కువగా నివసించే బస్తీల్లో ప్రభుత్వ ఆస్పత్రులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ మించి బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్న విమర్శలు కూడా గత పదేళ్ల నుంచి వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎప్పుడెప్పుడు ఎంత మొత్తంలో నిధులు పారించారో, బీజేపీయేతర రాష్ట్రాలకు నిధుల విషయంలో కేంద్రం ఎంతగా కోతలు పెట్టిందో లెక్కలతో సహా వెల్లడించారు ఆర్థిక నిపుణులు. ఈ దుర్మార్గానికి ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కార్ ఎండ్ కార్డ్ వేయాలి. ఏ పార్టీ అధికారంలో ఉందన్న విషయాన్ని పక్కన పెట్టి , అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.