దేశ అభివృద్ధిలో తెలంగాణ, ముఖ్యంగా సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో రూ.9,377 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.
సైబరాబాద్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఉపాధి కేంద్రంగా ఎదుగుతోందని, సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో తెలంగాణ కీలక స్థానం సంపాదించిందని మోదీ అన్నారు. వరంగల్లో ప్రారంభించిన ‘పీఎం మిత్ర’ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దేశ టెక్స్టైల్ రంగానికి కొత్త దిశ చూపుతుందని, దీని ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, ఆ అభివృద్ధి వల్ల తెలంగాణ కూడా లాభపడుతోందని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రైల్వే బడ్జెట్లో రూ.1,000 కోట్లు కూడా రాకపోయేవని, ఇప్పుడు తెలంగాణకే రూ.5,500 కోట్లకు పైగా కేటాయిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి ఐదు వందే భారత్ రైళ్లు, ఆరు అమృత్ భారత్ రైళ్లు అందించామని తెలిపారు.
గుజరాత్కు మాత్రమే ఎక్కువ నిధులు ఇస్తున్నారనే విమర్శలను ప్రస్తావిస్తూ, గత పదేళ్లలో గుజరాత్కు ఎంత నిధులు ఇచ్చారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని మోదీ సవాల్ విసిరారు. గుజరాత్తో సమానంగా తెలంగాణకు నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం రాష్ట్రానికి అందుతున్న నిధుల్లో సగమే రావచ్చని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రధాని ప్రారంభించిన ప్రధాన ప్రాజెక్టుల్లో జహీరాబాద్లో రూ.2,360 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, మహబూబ్నగర్ వరకు జాతీయ రహదారి-167 విస్తరణ పనులు, వరంగల్లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, మల్కాపూర్ వద్ద గ్రీన్ఫీల్డ్ పీవోఎల్ ప్రాజెక్టు, కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, కాజీపేట రైల్ బైపాస్ లైన్ వంటి పథకాలు ఉన్నాయి.


