తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ .. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన సచివాలయానికి వెళ్లారు. నూతన సీఎంకు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ‘తలపతి’ సి. జోసెఫ్ విజయ్ తన తొలి ప్రసంగంతోనే స్పష్టమైన సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో ఒకే అధికార కేంద్రం ఉంటుందని, అది తానేనని ప్రకటిస్తూ తన నాయకత్వంపై ఎలాంటి సందేహాలకు తావులేదని తెలిపారు.
ముఖ్యమంత్రిగా తొలి ప్రసంగంలో విజయ్ మాట్లాడుతూ.. “నాకు తప్ప మరో పవర్ సెంటర్ ఉండదు. నిర్ణయాలు తీసుకునేది నేనే” అని స్పష్టం చేశారు. టీవీకే ఆధ్వర్యంలోని ప్రభుత్వం మిత్రపక్షాల ఒత్తిడులకు లోబడదనే భరోసాను ప్రజలకు ఇవ్వడమే తన ఉద్దేశమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తనను ‘తంబి’ (తమ్ముడు)గా పరిచయం చేసుకున్న విజయ్, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేసే వారు అలాంటి ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. “నేను తప్పు చేయను. నా వెంట ఉన్నవారిని కూడా తప్పు చేయనివ్వను. ఎవరికైనా చెడు ఆలోచనలు ఉంటే వెంటనే డిలీట్ చేసుకోండి” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన మేజిక్ ఫిగర్ సాధించడంలో మద్దతు తెలిపిన డీఎంకే మిత్రపక్షాలకు విజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తన “సోదరుడు”గా అభివర్ణించారు. అలాగే కే.సి. వేణుగోపాల్, సెల్వపెరుంతగై, ప్రవీణ్ చక్రవర్తి, సీపీఎం నేతలు పి. షణ్ముగం, సు. వెంకటేశన్, వీసీకే నేతలు తోల్ తిరుమావళవన్, రవికుమార్, వన్నియరసు, సీపీఐ నేత ఎం. వీరపాండియన్లకు కృతజ్ఞతలు తెలిపారు.
టీవీకే కార్యకర్తలు, సోషల్ మీడియాలో తనకు మద్దతుగా పనిచేసిన “వర్చువల్ వారియర్స్”కు కూడా విజయ్ ధన్యవాదాలు తెలిపారు.
దేవదూతను కాను
తనను ‘మామా’గా సంబోధించిన విజయ్, తాను దేవదూత కాదని, ప్రజల్లో ఒక సాధారణ వ్యక్తినేనని చెప్పారు. “చేయలేనివి హామీ ఇవ్వను. కానీ మీ సహకారంతో ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉంది. నేను ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేస్తాను. ప్రజల డబ్బులో ఒక్క పైసా కూడా తాకను” అని పేర్కొన్నారు.
విజయ్ కేబినెట్
విజయ్తో పాటు టీవీకేకు చెందిన మరో తొమ్మిది మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో ఏఐఏడీఎంకే సీనియర్ నేత కే.ఏ. సెంగొట్టయ్యన్ ముఖ్య ఆకర్షణగా నిలిచారు. ఎంజీఆర్, జయలలితలతో కలిసి పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. విజయ్కు అత్యంత సన్నిహిత వ్యూహకర్తగా పేరున్న ఆధవ్ అర్జున, టీవీ-సినీ రంగానికి చెందిన రాజ్మోహన్, దంతవైద్యుడిగా నుంచి రాజకీయ నాయకుడిగా మారిన డాక్టర్ టీకే ప్రభు, కేబినెట్లో అతి పిన్న వయస్కురాలైన ఎస్. కీర్తన కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల నేతలు శాఖల కేటాయింపులపై చర్చలు పూర్తైన తర్వాత మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశమున్నట్లు సమాచారం.


