స్వతంత్ర వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్ను సీఎం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నారు. 6.10 ఎకరాల విస్తీర్ణంలో రూ.12 కోట్ల వ్యయంతో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బ్రాహ్మణుల్లో కూడా చాలామంది పేదలున్నారని వారి సంక్షోమం కోసం ప్రతీ ఏటా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. బ్రాహ్మణ పరిషత్కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని రూ.12కోట్లతో నిర్మించాం. బ్రాహ్మణ సదన్ను నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి. వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా బ్రాహ్మణ సదన్ విలసిల్లాలి. బ్రాహ్మణుల సంక్షేమానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని మరో 2,696 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల పథకాన్ని వర్తింపజేస్తాం. ఈ పథకం కింద నెలకు ఇచ్చే నిధులను రూ.10వేలకు పెంచాం. వేదపండితులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంచాం. అర్హత వయసు 75 నుంచి 65 ఏళ్లకు తగ్గించాం’’ అని కేసీఆర్ తెలిపారు.
కాగా రంగారెడ్డి పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి గ్రామంలో బ్రాహ్మణ సదన్ భవనం నిర్మాణానికి బీఆఎస్ ప్రభుత్వం 6.10 ఎకరాలను కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 12 నిర్మాణాలు చేపట్టారు. 2017లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బ్రాహ్మణ సదన్ భవన ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనాలు ఉన్నాయి. త్వరంలోనే ఈ భవనంలో ఆధ్యాత్మిక గ్రంధాలు,వేదాలు, పలు ఆధ్యాత్మిక సాహిత్యాలు వంటివి అందుబాటులోకి రానున్నాయి.