బెగ్గింగ్ మాఫియాకు అడ్డాగా మారింది విశాఖ నగరం. ముక్కుపచ్చలారని అభం, శుభం తెలియని చిన్నారులతో భిక్షాటన చేయిస్తూ ఈ బెట్టింగ్ మాఫియా కోట్లు గడిస్తోంది. పసిపిల్లల బాల్యాన్ని, బంగారు భవితను మొగ్గ దశలోనే తుంచేస్తోంది. ఈ దందా కోసం పసి పిల్లలను దొంగలించే ముఠా కూడా ఈ గ్యాంగులో ఉందంటే బెట్టింగ్ మాఫియా ఏ రేంజ్లో రాజ్యమేలుతోందో అర్థం చేసుకోవచ్చు. మరి అడ్డూ, అదుపు లేకుండా సాగుతున్న ఈ మాఫియా అంతు చూసేదెవరు..? అరికట్టేదెవరు.? ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు..?
విశాఖ నగరంలో బెట్టింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. సిగ్నల్స్ వద్ద దీన స్థితిలో చిన్నారులు అమ్మా, అయ్యా అంటూ అడుక్కుంటుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆకలేస్తోంది సారూ అంటే కళ్లలో కనికరం పుట్టుకొస్తుంది. అయితే, ఇలా చేసేది వారి కడుపు నింపుకోవడానికి కాదు. బెట్టింగ్ మాఫియా జేబులు నింపడానికి. అనాధలుగా మారో, పేదరికం కారణంగానో రోడ్డున పడి యాచిస్తే అది వేరు. కానీ, చిన్నారులను టార్గెట్ చేసుకుని, వారి భవితవ్యం ఏమవుతుంది.? పొద్దంతా ఎండావానలనకా యాచక వృత్తికి దించితే వారి ఆరోగ్యం ఏమవుతుందన్న మానవత్వం మరిచి.. ఎక్కడ నుంచో చిన్నారులను రెంట్కు తీసుకువచ్చి ఎత్తుకువచ్చి వారిని యాచకులుగా మారుస్తోంది బెట్టింగ్ మాఫియా. ఇకపోతే ఈ కణికరం లేని దందాలో మహిళలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ మాఫియా చేతిలో మగ్గిపోతున్నారు. మరి కొందరు కిలాడీ లేడిలైతే దందా కోసం చిన్నారులను రెంట్కు తీసుకువచ్చి మరీ భిక్షాటన చేయిస్తున్నారు.
చంకన పిల్లతో దీనంగా యాచించే మహిళల దృశ్యాలు నగరంలో ఏ కూడలి వద్ద చూసినా దర్శనం ఇస్తాయి. ఇలా అడుక్కునేవారిలో చాలామంది నకిలీలే అన్న సంగతి చాలా మందికి తెలియదు. వీరిని ముందుంచి భిక్షం పేరుతో బిజినెస్ చేస్తున్న మాఫియా గురించి విన్నవాళ్లకు యాచక వృత్తి వెనుక పెద్ద మాఫియానే ఉందంటే మతులు పోవడం ఖాయం. ఈ బెగ్గింగ్ మాఫియా టర్నోవర్ ఏటా ఏకంగా 100 కోట్లపైనే ఉంటుందన్నఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, గతంలో ఇలాంటి దందాలను అరికట్టేందుకు ప్రభుత్వం ముస్కాన్ ఆపరేషన్ చేపట్టింది. భిక్షాటన చేస్తున్న పిల్లలను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ చిల్డ్రన్స్ హోమ్కు తరలించడమే కాకుండా.. ఈ నేరాలకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టింది. అయితే ఈ మధ్యకాలంలో పోలీసులు సైలెంట్కావడంతో భిక్షాటన గ్యాంగులు యథేచ్చగా పిల్లలతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద బిక్షాటన కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి. అయితే, అవసరాల్లోఉన్నవారిని, ఆపదల్లో ఉన్నవారికి.. కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి యాచక కూలీలుగా మార్చుకుంటోంది బెట్టింగ్ మాఫియా. టార్గెట్లు పెట్టి మరీ ఇంత వసూలు చేయాలంటూ వేధిస్తోంది. అంత తేలేకపోతే చిత్ర హింసలు పెడుతోంది ఈ మాఫియా.
విశాఖ జిల్లాలో 10 వేల మంది యాచకులున్నారని, అందులో 90 శాతం ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని ఒక ఎన్జీవో సర్వేలోవె ల్లడైంది. ఏ దిక్కూ లేకనో, కుటుంబాన్నిపోషించుకునేందుకో అడుక్కునేవారు వేయి మందే ఉంటారని గుర్తించింది ఈ సంస్థ. యాచకులుగా పని చేస్తున్నవారిని బెగ్గింగ్ మాఫియా అసాంఘిక కార్యకలాపాలకూ వినియోగిస్తోందని, సుపారీ దాడుల దగ్గరి నుంచి గంజాయి, డ్రగ్స్ విక్రయించడం వరకు చాలా పనులకు వినియోగిస్తోందని తేలింది. బెగ్గింగ్ మాఫియాలో యాచక కూలీలు వారికి అప్పగించిన ప్రాంతాన్ని బట్టి రోజూ 400 నుంచి 600ల వరకు వసూలుచేస్తారు. ముఠా లీడర్లు ఆ సొమ్మును తీసుకుని, రోజూ వందల రూపాయల నుంచి 200ల వరకు యాచకుల కు మాత్రమే వారికి ఇస్తారు. ఈ వసూళ్ల టార్గెట్లు, కూలీ మొత్తం కూడా ఒక్కో కూడలికి, పార్కులు, బస్టాండ్లను బట్టి మారుతుంది. మొత్తంగా బెగ్గింగ్మాఫియాకు ఏటా 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు చిల్లర సమకూరు తోందని స్వచ్చంద సంస్థల ఫెడరేషన్ సర్వేలో వెల్లడైంది. సుమారు 10 వేలమంది యాచ కులు రోజూ 400 రూపాయల చొప్పున వసూలు చేసి ఇస్తున్నారని, తద్వారా 40 లక్షలకుపైగా మాఫియాకు ఆదాయం వస్తోందని తెలిపింది. ఈ బెగ్గింగ్ మాఫియా ఆగడాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని బెగ్గర్ రిహాబిలిటేషన్ స్క్వాడ్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం. ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పలు ఎన్జీవోలు కూడా చెబుతున్నాయి. మరి జనం కోరుతున్నట్టు ఇకనైనా పోలీసులు ఈ బెట్టింగ్ మాఫియాపై దృష్టిసారిస్తారా..? లేదంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ.. బెట్టింగ్ మాఫియా ఆగడాలను చూసి చూడనట్టు వదిలేస్తారా చూడాలి.