టేక్ రెస్ట్..! ఏపీలో వివిధ పార్టీల అధినేతల మాట ఇప్పుడు ఇదే. అవును.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగియడంతో ప్రధాన పార్టీల అధినేతలు విదేశాల్లో సేద తీరుతున్నారు. ఇన్నాళ్లూ తీరిక లేని విధంగా ప్రచారం చేసిన వారంతా కాస్త రిఫ్రెష్ అయి మళ్లీ సొంత గడ్డపైకి అడుగుపెట్టనున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతోపాటు పార్లమెంటుకు పోలింగ్ ముగిసింది. నువ్వానేనా అన్నట్లుగా రెండు నెలల పాటు ప్రచారం హోరెత్తింది. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు రచించిన నేతలు.. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక మరింతగా శ్రమించారు. పైగా నడి వేసవి కావడంతో ప్రచారం చేయడం ఓ రకంగా ఎవరికైనా సవాలే. కానీ, ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కావడంతో ఎంత వేడి ఉన్నా.. తగ్గేదేలే అన్నట్లుగా నేతలు ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలోనే పవన్ సహా పలువురు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అయినా.. ఒకటీ రెండు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి ఎన్నికల క్యాంపెయినింగ్ చేశారు. అలాంటి నేతలంతా ఇప్పుడు పోలింగ్ ముగియడంతో సేద తీరుతున్నారు. కొందరు దేశంలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లగా.. మరికొందరు విదేశాల్లో విహార యాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
ఇప్పటికే వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. సతీ సమేతంగా లండన్ వెళ్లిన ఆయన.. తన కుమార్తెలతో కలిసి టూర్ను ఎంజాయ్ చేస్తున్నారు. అట్నుంచటే సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్ అంతా పూర్తి చేసుకొని జూన్ ఒకటి నాటికి ముఖ్యమంత్రి విజయవాడ రానున్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అమెరికా వెళ్లారు. పోలింగ్ ముగిసిన వెంటనే తిరుమల వెళ్లిన చంద్రబాబు.. ఆ తర్వాత వారణాసితోపాటు షిర్డీ సహా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తాజాగా తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లారు చంద్రబాబు. అయితే.. వైద్య పరీక్షల కోసం అని టీడీపీ నేతలు చెబుతున్నా.. ఇప్పటికే ఆయన తనయుడు నారా లోకేష్ కుటుంబం కూడా అక్కడే ఉండడంతో.. మెడికల్ టెస్టుల అనంతరం స్వల్ప విరామం తీసుకొని ఫలితాలకు ముందే హైదరాబాద్ చేరుకోనున్నారు చంద్రబాబు. అటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలోనే స్వల్ప అస్వస్థతకు గురైన పవన్.. వైద్యుల సూచనల మేరకు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం వీళ్లే కాదు.. వైసీపీ, టీడీపీకి చెందిన పలువురు నేతలు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ ప్రాంతాల్లో సేదతీరుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతానికి ఎవరు ఎక్కడున్నా ఎన్నికల ఫలితాల నాటికి అంతా ఏపీకి తిరిగి రానున్నారు.