గాజాపై యుద్ధంలో నాలుగురోజులపాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అదే సమయంలో హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 50 మంది ఇజ్రాయెలీలను విడుదల చేస్తుంది. ఇందుకు ఆమోదం తెలుపుతూ ఇజ్రాయెల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చొరవతో నాలుగు రోజులుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. దీంతో 50 మంది బందీల విడుదలకు హమాస్ ముందుకు రావడంతో ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణకు పచ్చజెండా ఊపింది. ఫలితంగా రాత్రి నుంచీ ఇజ్రాయెల్ నుంచి దాడులు, కాల్పులు ఆగాయి. ఇది కష్టమైన నిర్ణయమే అయినా.. సరైన నిర్ణయం అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు జరిపిన సందర్భంగా పలువురు మరణించగా దాదాపు 241 మంది ఇజ్రాయెలీలను హమాస్ బందీలుగా పట్టుకుంది. వారిలో నలుగురు బందీలను ఒకసారి, మరో సైనికుడిని మరో సారి హమాస్ ఇప్పటికే విడుదల చేసింది. గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ సురక్షితంగా ఇజ్రాయెల్కు రప్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. నెతన్యాహు తెలిపారు. విడుదలయ్యే 50 మందిలో మహిళలు, పిల్లలు ఉంటారు. నాలుగు రోజులలో వారంతా విడుదల అవుతారు.