ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతోంది. సమావేశంలో బీజేపీ ఎంపీలు, మిత్రపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. భేటీలో టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్జనశక్తి ఎంపీలు పాల్గొన్నారు. NCP,JDS, జనసేన, అప్నాదళ్ ఎంపీలు కూడా హాజరయ్యారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ అమిత్ షా, రాజనాథ్ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ప్రతిపాదనల అనంతరం అమిత్ షా, నడ్డా, చంద్రబాబు, రాజనాథ్ ప్రసంగాలు ఉంటాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు, బిహార్ సీఎం నీతీశ్కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతారు. ఎన్డీయేకు సంపూర్ణ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన్ను సర్కారు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే కానుంది. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 9న మోదీ ప్రమాణం ప్రమాణం చేసే అవకాశముంది. ఆదివారం సాయంత్రం 6గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సహా ప్రమాణం చేసే అవకాశముంది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి సొంతంగా లేదు. ఈ నేపథ్యంలో మిత్ర పక్షాలకు ఈసారి ప్రాధా న్యం పెరిగే అవకాశాలున్నాయి. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధాన మంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయి స్తారా? లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గత రెండు పర్యాయాలు మిత్రపక్షాలకు పౌర విమానయానం, ఉక్కు, ఆహార శుద్ధి, భారీ పరిశ్రమల వంటి శాఖలనే బీజేపీ కేటాయించింది. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో వ్యవసా యం, గ్రామీణాభివృద్ధి, రైల్వే, టెలికాం, వాణిజ్యం, నౌకాయానం వంటి కీలక శాఖలను మిత్ర పక్షాలకు ఇచ్చిన సందర్భాలున్నాయి. మరోవైపు టాప్-4గా చెప్పుకొనే హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహా రాల శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలోని 22 మంది సార్వత్రిక సమరంలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్రమంత్రివర్గం కొత్తవారితో సరికొత్త రూపు సంత రించుకొనే అవకాశముంది.
ప్రస్తుతం ఎన్డీయేలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్న పార్టీ టీడీపీ. దాంతో టీడీపీకి కేంద్ర కేబినెట్లో సముచిత స్థానం దక్కుతుందని తెలుస్తోంది. టీడీపీ ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి మూడు దాకా మంత్రి పదవులు రావొ చ్చని అంచనా వేస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవుల కేటాయింపు విషయాన్ని మోదీ నిర్ణయానికే వదిలిపెట్టి.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆయన ఒత్తిడి తెచ్చేం దుకు ఆస్కారం అధికంగా ఉందని తెలుస్తోంది. గతంలో టీడీపీ వాజ్పేయీ ప్రభుత్వంలో చేరకుండా స్పీకర్ పదవికే పరిమితమైంది. చంద్రబాబు మరోసారి అదే పంథాను అనుస రించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఆయన అమరావతి, పోలవరం నిర్మాణంతోపాటు రాష్ట్రానికి మౌలిక వస తులు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఒత్తిడి చేయడానికి వెనుకాడబోరని సమాచారం. మరోవైపు- బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని భాజపాను జేడీయూ డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.