మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రూ. 25 కోట్లు తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఈటల రాజేందర్ పార్టీలు మార్చారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు అందరి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఈటల రాజకీయంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గురించి జాగ్రత్తగా మాట్లాడాలని.. ఖబడ్దార్ ఈటల అంటూ షబ్బీర్ హెచ్చరించారు.
మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన పాల్వాయి స్రవంతి కూడా ఈటల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు బై ఎలక్షన్స్ లో నేతలను విచ్చలవిడిగా కొనుగోలు చేశారని ఆరోపించారు. తక్షణమే ఈటల క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.