గ్రేటర్ గులాబీ నేతల్లో ఆధిపత్య పోరు నడుస్తోందా…? తాజాగా బిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఎస్.ఐ.ఆర్ సమావేశాల్లో అది రచ్చకెక్కుతోందా…? అసలే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి సరైన ఫేస్ లేకపోవడం సమస్యగా మారగా ఇప్పుడు వర్గపోరు కారు పార్టీ అధిష్టానంకు తలనొప్పిగా మారింది. దీంతో పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టే పనిలో గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఢీలా పడ్డ బిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం పట్టు నిలుపుకుంది. 14 అసెంబ్లీ సీట్లు
గెలిచి గ్రేటర్ పరిధిలో బలమైన పార్టీగా నిలిచింది. అయితే ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో వచ్చిన
ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన
ఉప ఎన్నికల్లోను బిఆర్ఎస్ ఓటమి పాలయింది. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీని అన్ని తానై నడిపించే నాయకుడు గులాబీ పార్టీకి కరువయ్యారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరో పరిస్థితి. బిఆర్ఎస్ లో గెలిచిన దానం నాగేందర్ హస్తం గూటికి చేరడంతో అక్కడ సరైన నాయకత్వం బిఆర్ఎస్ కు లేకుండా పోయింది.
జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉండటంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆ నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దే భాధ్యతను అప్పగించింది. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో SIR, సభ్యత్వ నమోదుపై గ్రేటర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే పార్టీలో వర్గ పోరు బయటపడుతోంది. ఈ క్రమంలో పార్టీ కోసం కష్టపడే వారికి సరైన అవకాశాలు వస్తాయి అంటూ కేటీఆర్ చెప్తున్నా నేతల వైఖరిలో మాత్రం మార్పు కనపడటం లేదు.
ఇటీవల కంటోన్మెంట్ నియోజకవర్గం సమావేశంలో నేతల మధ్య విబేధాలు తెరపైకి వచ్చాయి. తనను పార్టీలో సీనియర్లు తొక్కే ప్రయత్నం చేస్తున్నారని మన్నె క్రిశాంక్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, SIR గ్రేటర్ హైదరాబాద్ ఇంఛార్జిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ టార్గెట్ గా మన్నె క్రిశాంక్ విమర్శలు చేశారని టాక్ వినిపిస్తోంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత, మన్నె క్రిశాంక్, గజ్జెల నగేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ఉన్నారు. దీంతో గులాబీ అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలోను నేతల మధ్య వార్ బహిర్గతం అయింది.మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ సభ్యత్వ నమోదు ఇంఛార్జిగా నియమించారు. బూత్ లెవెల్ లో ఇద్దరు ఏజెంట్లను నియమించాలని విష్ణు వర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేయగా దానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం తెలిపారట.అధిష్టానం నువ్వే అన్నట్లుగా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారట. దీంతో విష్ణు వర్ధన్ రెడ్డి సైతం అభిప్రాయం మాత్రమే చెప్పానని రిప్లై ఇచ్చినట్లుగా గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇక తెలంగాణ భవన్ లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి సరైన లీడర్ లేకపోవడంతో పార్టీ క్యాడర్ గందరగోళానికి గురవుతుంది. తమకు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక సతమతం అవుతున్నారు. దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత మన్నె గోవర్ధన్ రెడ్డికి ఇంఛార్జిగా భాధ్యతలు ఇచ్చారు. తాజాగా సభ్యత్వ నమోదు ఇంఛార్జిగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ను గులాబీ అధిష్టానం నియమించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ లీడర్ ఎవరు అనే దానిపై క్యాడర్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు
తెలుస్తోంది.
మన్నె గోవర్ధన్ రెడ్డి పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో కొంతమందిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్, దాసోజు శ్రవణ్ దృష్టికి తీసుకువెళ్లారట. దీంతో రియాక్ట్ అయిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో ఎవరు క్రమశిక్షణ ఉల్లఘించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన్నె గోవర్ధన్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తుండగా తాజాగా సభ్యత్వ నమోదు ఇంఛార్జ్ గా దాసోజు శ్రవణ్ తెరపైకి వచ్చారు. దీంతో ఎన్నికల నాటికి కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపుతారు అనే దానిపై ఇప్పటి నుంచే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.


