మహబూబ్నగర్ జిల్లాలో ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిన యువకుడు, యువతికి పెళ్లి సంబంధం కుదరడంతో కక్ష పెంచుకుని దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడిపై స్థానికులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్మాది మృతి చెందాడు.
పోలీసులు మరియు స్థానికుల వివరాల ప్రకారం.. జడ్చర్లలోని ఎర్రసత్యం కాలనీలో నివసించే రామచంద్రయ్య, శ్రీలత దంపతుల పెద్ద కుమార్తె వైష్ణవి (22) ఓ ప్రైవేట్ పాఠశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. గతంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేసే సమయంలో తేజ (28) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే తేజ ప్రేమ పేరుతో వెంటపడుతున్నప్పటికీ వైష్ణవి అతనిని తిరస్కరించింది.
ఇటీవల వైష్ణవికి పెళ్లి సంబంధం కుదరడంతో ఆగ్రహానికి గురైన తేజ, ఆమెపై కక్ష పెంచుకున్నాడు. శనివారం స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న వైష్ణవిని వెంబడించి, వెంట తీసుకువచ్చిన కత్తితో గొంతు కోసి దారుణంగా దాడి చేశాడు.
తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన వైష్ణవిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
హత్య అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన తేజను స్థానికులు నసురుల్లాబాద్ రోడ్ సమీపంలో పట్టుకుని అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తేజ మృతి చెందాడు.
ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, దాడి సమయంలో వైష్ణవి తనను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు తీసుకుందని తేజ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


