తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జోసెఫ్ విజయ్( C Joseph Vijay) ప్రభుత్వం ఇప్పుడు పాలనలో కీలక అడుగులు వేస్తోంది. శుక్రవారం సీఎం విజయ్ తన తొలి కేబినెట్లోని తనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులకు శాఖలను అధికారికంగా కేటాయించారు. ఇందులో ముఖ్యంగా హోం, పోలీస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలను తన దగ్గరే ఉంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మహిళలు, యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన TVK ప్రభుత్వం.. అదే వర్గాలకు సంకేతాలు ఇచ్చేలా మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖలను కూడా విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై వంటి పట్టణాభివృద్ధి శాఖలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. సంక్షేమ పథకాల అమలు, పట్టణ పాలనపై ప్రత్యక్ష పట్టు కొనసాగించాలన్న ఉద్దేశంతోనే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
ప్రభుత్వంలో నెంబర్ టూ స్థానం పొందిన ఆనంద్ కు (N Anand ) గ్రామీణాభివృద్ధి మరియు జలవనరుల శాఖలు అప్పగించారు. పంచాయతీలు, పేదరిక నిర్మూలన, సాగునీటి ప్రాజెక్టులు ఆయన బాధ్యతల్లో ఉంటాయి.
విజయ్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అధవ్ అర్జునకు (Aadhav Arjuna) కు పబ్లిక్ వర్క్స్ మరియు స్పోర్ట్స్ డెవలప్మెంట్ శాఖలు ఇచ్చారు. గతంలో డీఎంకే ప్రభుత్వంలో ఈ క్రీడాశాఖను ఉదయనిధి స్టాలిన్ నిర్వహించడం విశేషం.
మాజీ IRS అధికారి , వైద్యుడు డాక్టర్ అరుణ్ రాజ్( Dr KG Arunraj) కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు అప్పగించారు.
రాజకీయంగా కీలకమైన నిర్ణయంగా భావిస్తున్న మరో అంశం ఏమిటంటే.. AIADMK నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత KA Sengottaiyan కు ఆర్థిక శాఖ బాధ్యతలు ఇవ్వడం. పెన్షన్లు, పెన్షన్ అలవెన్సులు కూడా ఆయన పర్యవేక్షణలో ఉంటాయి.
కేబినెట్లో అతి పిన్న వయస్కురాలు, ఏకైక మహిళా మంత్రి అయిన సెల్వి కీర్తన( Selvi S Keerthana) చరిత్ర సృష్టించారు. తమిళనాడు తొలి మహిళా ఇండస్ట్రీస్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖలు ఆమె చేతిలో ఉండనున్నాయి.
వెంకటరామనన్(Venkataramanan) కు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖలు, వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ బాధ్యతలు అప్పగించారు.
నిర్మల్ కుమార్ (R Nirmalkumar)కు విద్యుత్, న్యాయ శాఖలను నిర్వహించనున్నారు. విద్యుత్, కోర్టులు, జైళ్లు, అవినీతి నిరోధక విభాగాలు, ఎన్నికల శాఖలు ఆయన ఆధీనంలో ఉంటాయి.
రాజ్ మోహన్ (Rajmohan) కు పాఠశాల విద్య, తమిళాభివృద్ధి, సమాచార శాఖలు అప్పగించారు. తమిళ సంస్కృతి, సినీ సాంకేతికత, ప్రభుత్వ ముద్రణ శాఖలు కూడా ఆయన పరిధిలో ఉంటాయి.
డెంటిస్ట్గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన టీకే ప్రభు( Dr TK Prabhu) కు ఖనిజాలు, గనుల శాఖలతో కూడిన సహజ వనరుల శాఖ బాధ్యతలు ఇచ్చారు.
అయితే ఇంకా పలు కీలక శాఖలు ఖాళీగానే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, వ్యవసాయం, ఐటీ, పర్యాటకం, హౌసింగ్, మైనారిటీ వెల్ఫేర్ వంటి శాఖలకు ఇంకా మంత్రులను ప్రకటించలేదు. దీంతో త్వరలోనే విజయ్ కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా.. డీఎంకేతో పొత్తు తెంచుకుని TVKతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశముందని సమాచారం. మరోవైపు CPI, CPM మాత్రం ప్రభుత్వంలో చేరబోమని స్పష్టం చేశాయి.
అత్యంత ఆసక్తికర అంశం ఏమిటంటే.. విశ్వాస పరీక్షలో AIADMKకు చెందిన 24 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం. దీంతో AIADMKలో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో TVK 108 సీట్లు గెలుచుకుని మెజారిటీకి 10 సీట్లు తక్కువ వచ్చినప్పటికీ, మిత్రపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రెండు స్థానాల నుంచి గెలిచిన విజయ్.. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు.


