గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో విచారణ వేగంగా సాగుతోంది. సత్యవర్థన్పై దాడి, కిడ్నాప్ వ్యవహారంలో పక్కా సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. వంశీ తరఫున ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ దాఖలు చేశారు న్యాయవాదులు. ఇక, ములాఖత్లో వల్లభనేని వంశీని కలిసేందుకు మంగళవారం విజయవాడ రానున్నారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్.
సాక్ష్యాలు సేకరించడం, వాటిని సరిపోల్చుకోవడం, చివరకు వాటిని నిర్ధారించడం.. సరిగ్గా ఈ కోణంలోనే సాగుతోంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసు విచారణ. ఇందులో భాగంగా సీసీ కెమేరాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు పోలీసులు. కీలక ఆధారాలన్నీ అందులోనే ఉన్నట్లు గుర్తించారు. బాధితుడు సత్యవర్థన్ను వంశీ ఇంటికి ఆయన అనుచరులు తీసుకువెళ్లడం, మరుసటి రోజు కారులో విశాఖకు తరలించడంతోపాటు విజయవాడ కోర్టుకు తీసుకువచ్చిన దృశ్యాలు ఆయా ప్రదేశాల్లోని సీసీ కెమేరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీంతో.. ఆ కోణంలో సాక్ష్యాలను సేకరించి వంశీ పాత్రను ఈ కేసులో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు ఖాకీలు.
ఇప్పటికే వంశీ ఫోన్ దొరక్కపోవడంతో మిగిలిన ఆధారాలపై దృష్టి సారించిన దర్యాప్తు బృందాలు.. ఆ దిశగా శరవేగంగా కదులుతున్నాయి. మొత్తం ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చగా.. ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఏ2గా కొమ్మా కోట్లు, ఏ3 భీమవరపు యతీంద్ర అలియాస్ తేలప్రోలు రాము, ఏ5 ఓలుపల్లి రంగా, ఏ6 వజ్రకుమార్, ఏ9 ఎర్రంశెట్టి రామాంజనేయులు, ఏ 11 చేబ్రోలు శ్రీను, ఏ 12గా వేణు ఉన్నారు. వీరి ఆచూకీ కోసం రెండు బృందాలు హైదరాబాద్లో గాలిస్తున్నాయి. అయితే.. వీళ్ల ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండడంతో బంధువులు, సన్నిహితులకు వచ్చే కాల్స్పై నిఘా పెట్టారు. వీరిలో కీలకంగా భావిస్తున్న రంగా, కోట్లు, రాము దొరికితే కేసు మొత్తం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న మాట విన్పిస్తోంది.
గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును ఉపసంహరించుకునేలా… సత్యవర్థన్పై అతని బంధువు వజ్రకుమార్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఒప్పించినట్లు ప్రచారం సాగుతోంది. పోలీసులకు ఈ విషయాన్ని సత్యవర్థన్ పూస గుచ్చినట్లుగా వివరించినట్లు తెలిసింది. తనను కిడ్నాప్ చేశాక ఏ రోజు ఎక్కడెక్కడ ఉంచింది, ఎలా తీసుకెళ్లింది వివరంగా చెప్పినట్లు సమాచారం. ఈ వివరాలతో సత్యవర్థన్ను వంశీ ఇంటికి తీసుకెళ్లి సాంకేతిక ఆధారాలతో సరిపోల్చి చూశారు. వంశీ ఇంటి దగ్గర సీసీ కెమేరాలు ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో వంశీ అనుచరులు సత్యవర్థన్ను తీసుకొస్తున్న దృశ్యాలు ఉన్నాయి. అనంతరం రెండు కార్లలో సత్యవర్థన్ను వంశీ అనుచరులు విజయవాడ నగర న్యాయస్థానాల సముదాయంలోకి తీసుకెళ్లారు. తిరిగి రాత్రికి రాయదుర్గంలోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు పోలీసులు.
ఇప్పటికే వంశీ కేసును పూర్తిస్థాయిలో సాంకేతిక ఆధారాలతో విచారణ జరుపుతామని ప్రకటించారు విజయవాడ సీపీ రాజశేఖర బాబు. ఆ క్రమంలోనే ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా, క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇక, వంశీ ఉంటున్న జైలులో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ కేసుల్లో నిందితులు ఉండడంతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక, ములాఖత్లో భాగంగా వంశీని కలిసేందుకు మంగళవారం విజయవాడలోని జైలుకు వస్తున్నారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్.
ఇక, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తరఫున ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు. వంశీ మెడికల్ రిపోర్ట్లతో మరో పిటిషన్ సైతం వేశారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యేక వైద్య సదుపాయాలు, ఇంటి నుంచి ఆహారం అందించే సదుపాయం కల్పించాలని కోరారు. తనపై రాజకీయ, వ్యక్తిగత కక్షతోనే కేసులు నమోదు చేశారని తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు వంశీ.