ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పెన్షన్లు పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చుతూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వైఎస్సార్ పేరు తొలగించారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్లు వంటి వారికి పెన్షన్లు పెంచారు. ఇప్పటివరకు 3వేలు ఉన్న పెన్షన్ 4వేలకు పెంచారు.
సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతల స్వీకరణ అనంతరం మూడో సంతకం పింఛన్ల పెంపు దస్త్రంపై పెట్టారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నా రు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారు లు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3 వేల పింఛన్ను ఒకేసారి 4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జులై 1న పింఛను కింద వీరికి 7 వేలు అందిస్తారు. దివ్యాంగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసానిచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న 3 వేలను ఒకేసారి 6 వేలకు పెంచారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్ఛైర్లో ఉన్న వారికి అందే 5 వేల పింఛను 15 వేలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే 5 వేలను 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్ఠు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6 వేలు పింఛను ఇవ్వనున్నారు. వీరందరికీ పెంచిన మొత్తాన్ని జులై 1న అందించనున్నారు. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛనుదార్లకు పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు వెయ్యి 939 కోట్లు ఖర్చవుతోంది. పెంచిన పింఛను అమలుకుగాను జులై నెలకు 4వేల 408 కోట్లు ఖర్చు కానుంది. ఆగస్టు నుంచి నెలకు 2 వేల 758 కోట్లు అవసరమవుతుంది. మొత్తంగా ఏడాదికి 33 వేల 99 కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు.


