స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం కష్టమేనని.. వారు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరడానికి వారికి భౌతికంగా ఇబ్బందులున్నాయని తెలిపారు. దీంతో ఈటల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ ఇతర పార్టీ నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లితో రెండు మూడు సార్లు భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వారు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరు కాంగ్రెస్లో చేరవొచ్చని స్వయంగా ఈటలే కామెంట్స్ చేయడం తెలంగాణలో రాజకీయ చర్చకు తెరలేపింది.