Y.S. Sharmila | రైతులను మోసగిస్తున్న “420” మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు పది రోజుల్లో పరిహారం ఇస్తామని కమ్మటి మాటలు పలికిన దొర గారు ఇప్పటివరకు రూపాయి విదల్చలేదని ట్విట్టర్ లో తెలిపారు. కేసీఆర్ బుద్ధి తేనెపూసిన కత్తి అని మరోసారి తేలిపోయిందని పేర్కొన్నారు. తొలుత 2.28లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని లెక్కలుగట్టి… చివరకు 1.51లక్షల ఎకరాల్లో మాత్రమేనని తేల్చి రైతుల నోట్లో మట్టి కొట్టాడని మండిపడ్డారు. అన్నదాతలను ఆదుకుందామన్న సోయి లేదు కానీ… మాది కిసాన్ సర్కారు అని పక్క రాష్ట్రాల్లో దొంగ ప్రచారం చేసుకోవడం మాత్రం చేతనైతదా అంటూ చురకలు అంటించారు. ఏడాది కింద నష్టపోయిన రైతులకు సైతం కేసిఆర్ పరిహారం ఎగ్గొట్టిండని మండిపడ్డారు. ఇప్పుడు కూడా పైసా ఇవ్వకుండా నాన్చుతుండని… రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేలు కాకుండా వరి పంటకు రూ.25వేలు, మిర్చి, మొక్కజొన్న పంటకు రూ.50వేలు, మామిడికి రూ.75 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.