ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించినా అయన బెట్టు వీడటం లేదు. అయినా వైసీపీ నేతలు సారథి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంతకీ ఎమ్మెల్యే పార్థసారథిని ఎందుకు అంతలా బతిమాలుతున్నారు… సారథి వైసీపీకి గుడ్ బై చెబితే జరిగే నష్టం ఎంటి.?
వైసీపీలో సీనియర్ నేత, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సీఎం జగన్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన సభలో ఎమ్మె ల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. సీఎం జగన్ తనను గుర్తించకపోయినా నియోజక వర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఈ వ్యాఖ్యల పై పార్టీ పెద్దలు అయన నుంచి వివరణ తీసుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అనలేదని చెప్పుకొచ్చారు పార్థసారథి. అయితే తాజాగా ఎమ్మెల్యే పార్థసారథి టిడిపిలో చేరతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 18న ముహూర్తం కూడా ఖరారు అయిందని అయన అనుచరులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో వైసీపీ పెద్దలు అయన్ని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. పార్థ సారథిని సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్వయంగా సారథితో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని కోరారు. అయితే అందుకు పార్థసారథి సిద్దంగా లేరని … అంతేకాదు పార్టీలో కొనసాగే విషయంలోనూ పార్టీ ముఖ్య నేతలకు స్పష్టత ఇవ్వడం లేదు. తాజాగా టిడిపి నేతలు పార్థసారథి నివాసానికి వెళ్లి అయన్ని టిడిపిలో చేరే విషయం పై చర్చించారు. టిడిపి నేతలకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎం. అరుణ్ కుమార్ కూడా పార్థసారథి నివాసానికి వచ్చారు. వైసీపీలో కొనసాగేలా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల సందర్భంగా టికెట్ రాని వారికి నచ్చే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ఒకవేళ ఎవరైనా మాట వినకుంటే తమ దారి తాము చూసుకో వచ్చని చెబుతున్నారు. అయితే పార్థ సారథి విషయంలో మాత్రం వైసీపీ పెద్దలు ఒక అడగు వెనక్కి తగ్గి అయనను బుజ్జగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్థసార థికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం వుందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు అన్ని రకాల పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నారు. అయితే ఎన్నికల సమయానికి బిసి నేతలు ఒక్కొక్కరు జగన్ కి గుడ్ బై అంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన బిసి నాయకుడు, ఎమ్మెల్సీ వంశి కృష్ణ యాదవ్ వైసీపీనీ వీడి జనసేనలో చేరారు. అలాగే బిసి సామాజిక వర్గానికే చెందిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైసీపీనీ కాదని టిడిపిలో చేరారు. జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకొని మొదటి నుంచి పార్టీలో వున్న కాపు రామచంద్రారెడ్డి జగన్కి గుడ్ బై చెప్పారు.
బీసీ సామాజిక వర్గం నేత పార్థసారథి కూడా పార్టీని వీడితే.. ఇంతకాలం చెబుతున్న బిసి నినాదానికి ఇబ్బందివు తుందని సీఎం జగన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిసిలు తమకు అండగా ఉంటారని జగన్ భావిస్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో బిసి నేతలు ఒక్కొక్కరు ఇలా టిడిపి బాట పడితే.. అయా సామాజిక వర్గాలు కూడా వైసీపీకి దూరం అవుతాయనే ఆందోళన చెందుతున్నారు వైసీపీ పెద్దలు.