వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేశారు. బాలశౌరితోపాటు కృష్ణా జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. గుంటూరు, కృష్ణా రెండు జిల్లాల నుంచి భారీ ప్రదర్శనతో బాలశౌరి, ఆయన అనుచరులు మంగళగిరికి రానున్నారు. గత రెండు మూడు రోజులుగా విజయవాడ, గుంటూరుల్లోని ఎంపీ బాలశౌరి కార్యాలయానికి పెద్దఎత్తున ఆయన అభిమానులు, మద్దతుదారులు చేరుకుని సంఘీభావం తెలుపుతున్నారు.
గుంటూరులోని ఎంపీ ఇంటి నుంచి మధ్యాహ్నం 3గంటలకు ర్యాలీగా బయలుదేరి కాజా టోల్గేట్ వరకూ చేరుకుంటారు. మరోవైపు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జనసైనికులు, బాలశౌరి మద్దతుదారులు కలిసి ప్రదర్శనగా బయలుదేరి చల్లపల్లి, మచిలీపట్నం, విజయవాడ మీదుగా కాజా వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి అంతా కలిసి జనసేన కార్యాలయానికి వెళ్లేలా రూట్మ్యాప్ సిద్ధం చేశారు.2004 వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని.. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా బందర్ నుండి పోటీ చేసి గెలిచానని బాలశౌరి చెప్పారు. బందర్ పోర్టు నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. పోలవర తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా పనులు జరగలేదని.. పోలవరం, స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ కల్యాణ్ తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని బాలశౌరి తెలిపారు.