ఆశా వర్కర్లపై ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటి దుర్మార్గం అంటూ ప్రశ్నించారు. ఆశా వర్కర్ల ఆందోళనలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా? అంటూ మండిపడ్డారు. ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారని నిలదీశారు. దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా? అంటూ నిప్పులు చెరిగారు.
హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్ళంటే అంత చులకనా? అంటూ కేటీఆర్ అడిగారు. ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా? అంటూ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు.. సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్వాలను తట్టుకోలేరని డిమాండ్ చేశారు.